అక్షరటుడే, వెబ్డెస్క్: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో వచ్చిన పెడ ధోరణులు, రాజకీయ పార్టీల వైఖరిలో మార్పులు విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నాయి.
నిజాలు నిష్పక్షపాతంగా చెప్పడాన్ని ఓర్చుకోలేక పోవడం, సత్యాలను సమాజం ముందుకు తెస్తుండడాన్ని భరించలేని స్థాయికి దిగజారడం వల్ల మీడియాపై దాడులు పునరావృతమవుతున్నాయి. మొన్న ఆంధ్రప్రదేశ్ లో ‘సాక్షి’ Sakshi సంస్థలపై, అంతకు ముందు సీనియర్ నటుడు మోహన్బాబు Mohan Babu విలేకరులపై, తాజాగా మహా న్యూస్ ఛానల్పై.. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ ఇలా వరుసగా జరుగుతున్న దాడులు.. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు స్తంభాలు శాసన, న్యాయ, కార్యనిర్వాహక శాఖలకు తోడుగా నాలుగో స్తంభంగా చెప్పుకొనే మీడియా సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
Media : ఓర్వలేనితనం..
హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానల్ Maha News channel ఆఫీస్ పై ఓ రాజకీయ పార్టీకి చెందిన ప్రతినిధులు, విద్యార్థి విభాగం కార్యకర్తలు శనివారం దాడికి దిగారు. ఫోన్ ట్యాపింగ్ కేసు phone tapping case లో తమ నాయకుడి గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని పేర్కొంటూ ఛానల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. కనిపించిన వస్తువునల్లా నేలకేసి కొట్టారు. కంప్యూటర్లు, కార్లు, ఆఫీస్ అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయం లోనికి ప్రవేశించి హల్ చల్ చేశారు.
ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ జరిగిన ఈ దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అంతకు ముందు వైఎస్ జగన్ కుటుంబాని(YS Jagan family)కి చెందిన సాక్షి పత్రిక కార్యాలయాలపైనా ఏపీలో అక్కడక్కడ దాడులు జరిగాయి. సాక్షి ఛానల్ లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఓ జర్నలిస్టు ఏదో చేసిన వ్యాఖ్యను ఆపాదించి సాక్షి ఆఫీసులపై పడ్డారు. వాస్తవానికి ఓ వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పినప్పుడు దాన్ని సదరు మీడియా సంస్థకు ఆపాదిస్తూ దాడికి దిగడం చర్చనీయాంశమైంది.
అటు మహా న్యూస్ ఛానల్ ఆఫీసు పైన, ఇటు సాక్షి కార్యాలయాల పైన జరిగిన దాడికి కేవలం రాజకీయ కక్షల కారణంగానే జరిగాయన్నది సుస్పష్టం. ఇక, మంచు వారి ఇంటి మొదలైన లొల్లి.. అటు ఇటు తిరిగి విలేకరులపై దాడికి దారి తీసింది. వార్త కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై నటుడు మోహన్ బాబు చేయి చేసుకున్నారు. చేతిలోంచి మైక్ లాక్కుని దాడికి దిగారు. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నటుడు సంయమనం కోల్పోయి ఇలా చేయి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. జర్నలిస్టుల ఆందోళనలతో చివరకు దిగివచ్చిన మోహన్ బాబు క్షమించని వేడుకున్నారు.
Media : దండించడమెందుకు.. ఖండించవచ్చు కదా!
మారిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మీడియా సంస్థల్లో కూడా మార్పు వచ్చిందన్నది కాదనలేని నిజం. కొందరి ప్రయోజనాల కోసం కొన్ని పత్రికలు, చానళ్లు పని చేస్తున్నాయన్నది వాస్తవం. అయితే, రాజకీయ లబ్ధి కోసమో, మరే ఉద్దేశ్యంతోనో తమకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తే ఖండించవచ్చు. మీడియాను పిలిచి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లీగల్ నోటీసు పంపించవచ్చు. పరువుకు భంగం కలిగించారని నష్ట పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఇలా ఎన్నో రకాల అవకాశాలు ఉన్నప్పటికీ దాడులనే ఎంచుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రజాస్వామ్యంలో నిజం చెప్పడమే తప్పన్నట్టు వ్యవహరిస్తుండడం విస్మయానికి గురి చేస్తోంది. దాడుల ద్వారా వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోలేరని అందరూ తెలుసుకోవాలి. మీడియా సంస్థల ఆఫీసులలోకి చొచ్చుకెళ్లడం, విలేకరులపై దాడులు చేయడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయలేరని గుర్తెరగాలి. పత్రిక కథనాలపై, చానళ్ల ప్రసారాలపై ఆక్షేపణలుంటే ప్రజాస్వామ్యాయుతంగా, న్యాయ బద్ధంగా పోరాటం చేయాలి. అంతే తప్ప బల ప్రదర్శన చేస్తామంటే కుదరదు. ప్రజల నుంచి వ్యతిరేకత తప్ప సానుభూతి రాదు.