అక్షరటుడే, వెబ్డెస్క్:MP Arvind | నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీలో నెలకొన్న గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి(MP Arvind Dharmapuri) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇక నుంచి ఎంపీ లాడ్స్ (నిధులు) కేటాయింపు, ప్రొసీడింగ్ కాపీలు తన చేతుల మీదుగానే అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ లాడ్స్ ప్రొసీడింగ్స్లో కొనసాగుతున్న ఆనవాయితీ కారణంగా బీజేపీ(BJP)లో గ్రూప్ రాజకీయాలు పెరుగుతున్నట్లు ఎంపీ గుర్తించారు. దీంతో వాటిని తొలి దశలోనే నియంత్రించాలనే ఉద్దేశంతో ఇక నుంచి తానే తుది నిర్ణయం తీసుకోవాలని అర్వింద్ నిర్ణయించినట్లు తెలిసింది.
MP Arvind | ప్రతి సెగ్మెంట్కు రూ.70 లక్షలు..
ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి అర్వింద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను సమానంగానే చూస్తూ వస్తున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.70 లక్షల చొప్పున కేటాయిస్తూ వస్తున్నారు. కోవిడ్ కాలం మినహా మిగిలిన అన్ని సమయాల్లో ఐదు కోట్ల నిధులను ప్రతి నియోజకవర్గానికి చేరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో బీజేపీలో ఆధిపత్య పోరుకు దారి తీసిందని ఎంపీ దృష్టికి వచ్చింది. దీంతో అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఎంపీ అరవింద్ (MP Arvind) నిధుల ప్రొసీడింగ్స్ విషయంలో తానే తుది నిర్ణయం తీసుకుంటానని పార్టీ వర్గాలకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.
MP Arvind | స్థానిక లీడర్లను తప్పించి..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం (Assembly constituency) నుంచి తన కార్యాలయానికి వచ్చే దరఖాస్తులను పరిశీలించి, స్థానిక అవసరాల నిమిత్తం ఎంపీ అర్వింద్ నిధులు కేటాయించే వారు. అయితే ఈ విషయంలో స్థానిక నాయకుల సిఫారసులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నియోజక వర్గంలోని కీలకమైన ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమైన పనులకు నిధులు కేటాయించేవారు. ప్రొసీడింగ్ పత్రాలను మాత్రం ముఖ్య నాయకుల ద్వారా ఇప్పించేవారు. ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను ఈసారి కూడా కొనసాగించాలని అనుకున్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీలో నెలకొన్న గ్రూపుల నేపథ్యంలో భవిష్యత్తులో తన ఆధ్వర్యంలోనే ప్రొసీడింగ్ పత్రాలు (Proceeding documents) ఇవ్వాలని అర్వింద్ నిర్ణయించినట్టు సమాచారం.
పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ బలోపేతం అవుతున్న తరుణంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇబ్బందికరంగా మారకూడదని అర్వింద్ భావించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చు అభివృద్ధి నిధుల విషయం మొత్తం ఎంపీ అర్వింద్ పర్యవేక్షణకు సిద్ధమైనట్టు, అదేవిధంగా తన కార్యాలయ సిబ్బందికి సైతం ఆదేశాలిచ్చినట్టు సమాచారం.