అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే.. అదే మేడిగడ్డ(Medigadda) మీద చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన దళిత బంధు సాధనసమితి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్(kTR).. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ‘రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని’ వ్యాఖ్యానించారు. అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉండే విధంగా రాజ్యాంగం రాశారన్నారు. లేకుంటే దేశంలో రేవంత్ లాంటి మోసాగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారని పేర్కొన్నారు. రాజకీయాల్లో తిట్లు, భూతులు వాడడం తమకు ఇష్టం లేదని కేటీఆర్ తెలిపారు. కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుందని.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదని వ్యాఖ్యలు చేశారు.
KTR | చర్చకు రాకుండా పారిపోయిండు..
ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రాజెక్టు కాళేశ్వరం (Kaleshwaram Project) నిర్మించామని, ఏదో ఒకటి, రెండు పిల్లర్లు కుంగిపోతే దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం కూలేశ్వరమని సీఎం వ్యాఖ్యానించడం తెలివి తక్కువతనమేనన్నారు. కూలిందంటున్న మేడిగడ్డ బ్యారేజీ మీదనే చర్చ పెడదామని, రేవంత్కు దమ్ముంటే చర్చకు రా అని సవాల్ విసిరారు. చర్చకు రమ్మని చేసిన సవాల్కు స్పందించి తాను చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయిండని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తవా అని పిలిచి పారిపోయిన పిరికి సన్నాసి రేవంత్ రెడ్డి విమర్శించారు. మరొకసారి నాగార్జునసాగర్ కట్టపైన చర్చకు వస్తావా అని సవాల్ విసిరిండని.. రేవంత్ రెడ్డికి తెలివిలేక కాళేశ్వరాన్ని కులేశ్వరం అంటున్నారని ధ్వజమెత్తారు.
నాగార్జునసాగర్ కట్టమీద కాదు.. మేడిగడ్డ బ్యారేజ్ మీద చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గం(Tungaturthi Suryapet Constituency) చివరి మడి వరకు నీళ్లు ఇచ్చిన నాయకుడు కేసీఆర్(KCR) అని రేవంత్ రెడ్డికి తెలుసు. అయినా తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘తనను దొంగ లెక్క చూస్తున్నారని ముఖ్యమంత్రి పదేపదే మాట్లాడుతుండు. ఇచ్చిన అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి… నన్ను కోసుకు తింటారా అంటూ రంకెలు వేస్తుండు. ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజలను అంటుండు. ప్రజలు ఏం చేస్తారో, ఏం పీక్కుంటారో రానున్న స్థానిక సంస్థల్లో చూపిస్తారని’ కేటీఆర్ తెలిపారు.