అక్షరటుడే, హైదరాబాద్: Cyberabad Police : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక డ్రైవ్లు చేపడుతూ ట్రాఫిక్ ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.
కాగా, రాంగ్ రూట్ లో వాహనదారులు ప్రయాణించడం వల్ల ఎక్కవగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల సర్వేలో వెల్లడైంది. ఈమేరకు రాంగ్ రూట్లో ప్రయాణించేవారిపై సైబరాబాద్ పోలీసులు కొరడా ఝలిపించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించేవారి ఫొటోలను పోలీసులు మాత్రమే తీసేవారు. ప్రధాన జంక్షన్లలోని కెమెరాల ద్వారా వారిని పసిగట్టేవారు. ఇకపై ఇలాంటి వారిపై సరికొత్త ఆయుధం ప్రయోగించబోతున్నారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ wrong route driving నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా వాహనదారులు రాంగ్రూట్లో ప్రయాణిస్తుంటే.. వారి ఫొటోలు తీసే అధికారాన్ని సాధారణ ప్రజలకు ఇచ్చారు. నిబంధన అతిక్రమించి, రాంగ్ రూట్లో వెళ్లేవారి ఫొటో తీసి వాట్సప్లో పంపిస్తే.. అలాంటి వాహనదారులకు జరిమానా విధిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాంగ్ రూట్లో వెళ్లేవారి ఫొటోలు, వీడియోలను తమ వాట్సప్ నంబరు WhatsApp number 94906 17346 కు పంపించాలని కోరారు. వాటితోపాటు సమయం, తేదీ, ప్రాంతం(లొకేషన్)location వంటి వివరాలు పొందుపర్చాలని సూచించారు.
సైబరాబాద్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సామాన్యులు ప్రశంసిస్తున్నారు. ఇలా రాష్ట్రమంతటా వర్తింపజేయాలని కోరుతున్నారు.