అక్షరటుడే, వెబ్డెస్క్: Rudrastra | శత్రుదేశాలతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగు పరుచుకుంటోంది. ఇప్పటికే మేకిన్ ఇండియా(Make in India)లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో పలు కీలక ఆయుధాలను తయారు చేస్తున్న భారత్ తాజాగా మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. దీంతో మన అమ్ములపొదిలో త్వరలో రుద్రాస్త్ర చేరనుంది.
భారత్ ఇటీవల ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టి పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఆ దాడులను భారత్ తిప్పికొట్టింది. భవిష్యత్లో డ్రోన్ దాడులను మరింత సమర్థంగా అడ్డుకోవడానికి పూర్తి స్వదేశీ టెక్నాలజీ సాయంతో మానవరహిత వైమానిక వాహనాల (UAV) డ్రోన్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది.
Rudrastra | లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి
ఇండియన్ ఆర్మీ ‘రుద్రాస్త్ర’ (Rudrastra) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన ఈ హైబ్రిడ్ యూఏవీని రాజస్థాన్లోని పోఖ్రాన్లో పరీక్షించారు. రుద్రాస్త్ర ఎంచుకున్న లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.
Rudrastra | ప్రత్యేకతలు ఇవే..
భారత్ పరీక్షించిన ఈ యూఏవీలను రన్వేలు అవసరం లేకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండ్ చేయొచ్చు. నిఘా, మ్యాపింగ్, డెలివరీ వంటి అవసరాలకు దీనిని వినియోగించవచ్చు. స్వదేశీ హైబ్రిడ్ (VTOL UAV)కి ఆత్మనిర్భర(రక్షణ తయారీలో భారతదేశం యొక్క స్వావలంబన) శక్తిని నొక్కి చెప్పడానికి రుద్రాస్త్ర అని పేరు పెట్టారు. 50 కిలోమీటర్ల పరిధిలో ఇది పనిచేస్తోంది. పరీక్షల సమయంలో ఈ యూఏవీవో మిషన్(UAVO Mission)ను పూర్తి చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దాని ప్రయోగ స్థానానికి తిరిగి వచ్చింది. భారత్ వద్ద ఇప్పటికే పలు యూఏవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినవి. ఈ క్రమంలో స్వదేశీ పరిజ్ఞానంతో రుద్రాస్త్రను రూపొందించారు. మరిన్ని పరీక్షల అనంతరం దీనిని సైన్యంలో ప్రవేశ పెట్టనున్నారు.