అక్షరటుడే, వెబ్డెస్క్ : America | అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్ పార్క్(Centennial Park)లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు.
ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీ(West Valley City)లో గల సెంటెనియల్ పార్క్లో ఆదివారం రాత్రి ‘వెస్ట్ఫెస్ట్’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు గాయపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఈ ఘటనలో మృతి చెందిన వారిని ఎజ్రా పంతలియోన్(8 నెలలు), పాల్ తాహి(20), ఏంజెలికా చావెజ్(21) గా గుర్తించారు. కాగా అగ్రరాజ్యం అమెరికాలో తరుచూ కాల్పులు చోటు చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అక్కడ ప్రజల కంటే తుపాకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. విచ్చలవిడిగా తుపాకులు లభిస్తుండడంతో వాటిని కొనుగోలు చేసిన కొందరు ఇలా కాల్పులకు తెగబడుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.