అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఇటీవల టాప్ కమాండర్ నంబాల కేశవరావు (Nambala Keshavarao) ఎన్కౌంటర్ మరువక ముందే మరో కీలక నేత మృతి చెందాడు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లోని బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ (Encounter)లో మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు (Security Focers) సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా.. మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మావోల అగ్రకమాండర్ సింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందాడు. ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
Encounter | 40 ఏళ్లుగా ఉద్యమంలో..
సుధాకర్ స్వస్థలం ఏలూరు (Elooru) జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. ఆయన 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో చేపట్టిన శాంతిచర్చల్లో సైతం ఆయన పాల్గొన్నారు. సుధాకర్ పూర్తి పేరు తెంటు లక్ష్మీనరసింహాచలం. కాగా ఏళ్లుగా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సుధాకర్ మృతితో మావోయిస్టులకు భారీ నష్టం జరిగిందని చెప్పవచ్చు.
Encounter | మావోయిస్టుల్లో ఆందోళన
దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. దీంతో భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతూ మావోల పని పడుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ప్రాంతాలను కూడా భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. దీంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు.
ఆపరేషన్ కగార్లో భాగంగా నిత్యం ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. అగ్ర నేతలు సైతం నేలకొరుగుతుండడంతో మావోయిస్టుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను ఆపాలని వారు కోరారు. ఈ మేరకు రెండు మూడు సార్లు లేఖ కూడా విడుదల చేశారు. తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని.. ఆపరేషన్ను ఆపాలని వారు కోరుతున్నారు. అయితే కేంద్రం మాత్రం చర్చలకు సుముఖత తెలపడం లేదు. మావోయిస్టులు తుపాకులు వదిలి లొంగిపోవాలని సూచిస్తోంది.