అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో వరుస ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు (Maoists) మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో కీలక నేతలు సైతం హతమయ్యారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉండటం గమనార్హం.
మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు పెద్ద సంఖ్యలో బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation)లో పాల్గొన్నాయి. ఈ క్రమంలో పచ్మదార్, కటేజిరియా అటవీ ప్రాంతాలలో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
Encounter | బలగాలను అభినందించిన సీఎం
మధ్యప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్ ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) ఎక్స్ వేదికగా స్పందించారు. దేశంలో 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో మధ్యప్రదేశ్ ఒక మైలు రాయి అని అన్నారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని ప్రకటించారు. ఘటన స్థలంలో గ్రెనేడ్ లాంచర్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్ (SLR), రెండు 315 బోర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లు, పోలీసు అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. భద్రతా దళాల ధైర్యం, నిబద్ధతను సీఎం యాదవ్ ప్రశంసించారు.
Encounter | కీలక నేతలు హతం
ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ కీలక నేతలు హతం అయ్యారు. ఓ వైపు క్యాడర్, మరోవైపు అగ్రనేతలను కోల్పోతుండటంతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారు. నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ లాంటి కీలక నేతలు ఇటీవల మరణించారు. ఈ క్రమంలో తమ ఉనికి చాటుకోవడానికి మావోలు దాడులకు పాల్పడుతున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల ఛత్తీస్గఢ్లోని మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామంలో ఓ వ్యక్తిని ఇన్ఫార్మర్ నెపంతో హత్య చేశారు. అంతేగాకుండా ఓ ట్రక్కును సైతం కాలబెట్టారు. అనంతరం కూంబింగ్కు వెళ్తున్న పోలీస్ వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా (sukma) జిల్లాలో ఈ పోలీస్ వాహనాన్ని మావోలు పేల్చేయగా ఏఎస్పీ ఆకాశ్రావు మృతి చెందారు. పలువురు సిబ్బంది గాయపడ్డారు. మొన్నటి వరకు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పిన మావోలు తాజాగా పంథా మార్చి దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందడం గమనార్హం.