అక్షరటుడే, వెబ్డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో మన దేశానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రష్యా, జపాన్ వంటి దేశాలు బాసటగా నిలుస్తామని చెప్పగా, తాజాగా అమెరికా కూడా ఆ జాబితాలో చేరింది. ఉగ్రవాదంపై పోరాడటానికి అన్ని వనరులను సహాయం చేస్తామని అమెరికా వెల్లడించింది. ఈ మేరకు అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని జాన్సన్ ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా భారతదేశంతో దృఢంగా నిలుస్తుందని, ఇంధన సహకారం, ఇతర వనరుల సహాయంతో సహా పూర్తిగా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
USA | ఉగ్రవ్యతిరేక ప్రయత్నాలకు మద్దతు..
భారత్ చేసే ఉగ్ర వ్యతిరేక ప్రయత్నాలకు సంపూర్ణంగా మద్దతు ఉంటుందని జాన్సన్ వెల్లడించారు. “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఆ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మేము సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తాం. ట్రంప్ పరిపాలన ఉగ్రవాదంపై పోరాడడానికి భారతదేశానికి అన్ని రకాల శక్తి వనరులను సహాయం చేస్తుంది” అని జాన్సన్ స్పష్టం చేశారు.
ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్కు అవసరమైన ఇంధన భాగస్వామ్యాలు, వనరులతో మేము అండగా ఉంటామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అయిన ఇండియా, అమెరికా పరస్పర సహకారంతో పని చేస్తాయని చెప్పారు. ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. “ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యునైటెడ్ స్టేట్స్ భారతదేశంతో బలంగా ఉంది. ప్రధాన మంత్రి మోదీ భారత ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంటుందని” ఆయన పేర్కొన్నారు.