అక్షరటుడే, వెబ్డెస్క్: US Attacks on iran | ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం(Israel – Iran war)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న సమరంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా(America) యుద్ధ రంగంలోకి అడుగిడింది. ఇప్పుడిదే అంశం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అగ్రరాజ్యం నేరుగా రణరంగంలోకి దిగడంతో మూడో ప్రపంచ యుద్ధం(World War III) ముప్పు పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు రక్షణగా ముస్లిం దేశాలు కూడా ఈ సమరంలోకి దిగితే పరిస్థితులు మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, ఇప్పటికే ఇరాన్(Iran)కు రహస్యంగా సైనిక సహకారం అందిస్తున్న చైనా(China) ఇప్పుడు నేరుగా సమర శంఖం పూరిస్తే మరో వరల్డ్ వార్ తప్పదన్న ఆందోళన నెలకొంది. అయితే, ఇరాన్కు ముస్లిం దేశాలు పెద్దగా సహకారం అందించకపోవచ్చన్న యుద్ధ నిపుణుల విశ్లేషణ కాస్త ఊరట కలిగించే అంశం. అయినప్పటికీ రానున్న వారం, పది రోజులు కీలకంగా మారనున్నాయి. ఇరాన్ – ఇజ్రాయెల్(Iran – Israel)తో పాటు అమెరికాపై ప్రతిదాడులు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో.. ఏయే దేశాలు ఈ యుద్ధంలోకి అడుగిడతాయనేది పక్షం రోజుల్లో తేలిపోనుంది.
US Attacks on iran | ఇరాన్పై అమెరికా బాంబింగ్
ఇరాన్కు చెందిన మూడు కీలక అణు స్థావరాలైన ఫోర్డో(Fordow), నాటాంజ్(Natanz), ఎస్ఫహాన్(Esfahan)లపై అమెరికా విరుచుకుపడింది. ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లతో(B-2 Stealth Bombers) 30 తోమహాక్ క్షిపణులతో ఆయా స్థావరాలను భూస్థాపితం చేసింది. ఇరాన్ అణు స్థావరాలపై దాడిని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) ధ్రువీకరించారు. ఇరాన్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని(Fordow Nuclear Power Plant) తాము సంపూర్ణంగా ధ్వంసం చేశామని ఆయన తన ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు. దానిపై ఆరు బంకర్ బస్టర్ బాంబులను(Bunker buster bombs) ప్రయోగించామని చెప్పారు. ఎస్ఫహాన్, నతాంజ్పై తమ సబ్మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పారు. “ఇరాన్లోని మూడు అణు ప్రదేశాలపై ఫోర్డో, నాటాంజ్, ఎస్ఫహాన్పై విజయవంతంగా దాడిని మేము పూర్తి చేసాము” అని ట్రంప్ పేర్కొన్నారు. “అన్ని విమానాలు ఇప్పుడు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి. బాంబుల పూర్తి పేలోడ్ను ప్రాథమిక సైట్ ఫోర్డోలో పడేశారు. అన్ని విమానాలు సురక్షితంగా ఇంటికి వెళ్తున్నాయి” అని ట్రంప్ వివరించారు.
US Attacks on iran | ఇజ్రాయెల్తో జతగా..
ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేస్తోందని చాలా కాలంగా ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ జూన్ 13న ఆ దేశంపై దాడులు ప్రారంభించింది. వాస్తవానికి ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో పగ పెంచుకుంటూ వస్తోంది. హమాస్, హెజ్బోల్లా, హౌతీలను ఇరాన్ పెంచి పోషిస్తూ తమ దేశంపై దాడికి ప్రేరేస్తోందని చెబుతోంది. అయితే కొంతకాలంగా టెహ్రాన్(Tehran) అణ్వస్త్రాలను తయారు చేయడంలో కీలక దశకు చేరడంతో ఇజ్రాయెల్లో ఆందోళన మొదలైంది. ఆ దేశం రూపొందించే అణ్వస్త్రాలు తమ దేశ అస్తిత్వానికి ముప్పుగా మారుతాయని పేర్కొంటూ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేయడంతో పూర్తి స్థాయి యుద్ధంగా మారింది. తాజాగా ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా యుద్ధరంగంలోకి దిగడంతో ఇరాన్ తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తోంది.
US Attacks on iran | ఎటు దారి తీస్తుందో..?
పది రోజులుగా రెండు దేశాల మధ్య జరుగుతున్న సమరంలోకి ఇప్పుడు అమెరికా చేరడంతో ఇది ఎటు దారి తీస్తుందన్న భయాందోళన నెలకొంది. ఈ వైమానిక దాడులు అమెరికాకు ప్రమాదకరంగా మారాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఇజ్రాయెల్తో కలిసి దాడుల్లో పాల్గొంటే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్పై దాడికి దిగితే కోలుకోలేని నష్టాన్ని చేకూర్చుతామని ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అని అమెరికాను హెచ్చరించారు. ఇంతలో, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై స్పందిస్తూ “ఏదైనా అమెరికన్ జోక్యం ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి యుద్ధానికి ఒక రెసిపీ అవుతుంది” అని పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా నేరుగా యుద్ధరంగంలోకి దిగడంతో ముస్లిం దేశాలతో పాటు రష్యా, చైనా ఏ విధంగా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరాన్కు రహస్యంగా సైనిక మద్దతునిస్తున్న చైనా.. రణరంగంలోకి దిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న చర్చ జరుగుతోంది.