అక్షరటుడే, వెబ్డెస్క్ :Allu Arjun | గత రాత్రి గద్దర్ అవార్డ్(Gaddar Awards) వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా మొదటి గద్దర్ అవార్డును అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth reddy)చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ‘పుష్ప: ది రూల్’ చిత్రంలోని నటనకు గాను బన్నీ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. ఇక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ, కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ్ దేవరకొండ స్వీకరించారు. పైడి జైరాజ్ అవార్డును మణిరత్నం.. బీఎన్రెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమార్ అందుకున్నారు.
Allu Arjun | అదరగొట్టారు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ నటుడి పురష్కారాన్ని స్వీకరించిన బన్నీ తెలంగాణ ప్రభుత్వానికి బన్నీ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘పుష్ప 2’ (Pushpa 2)సినిమాకి బన్నీ అందుకున్న ఫస్ట్ అవార్డు ఇది. అలానే బెస్ట్ యాక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫస్ట్ గద్దర్ అవార్డు తీసుకున్న హీరో కూడా ఆయనే. అందుకే అల్లు అర్జున్(Allu Arjun) ఈ అవార్డును ప్రత్యేకంగా భావిస్తున్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును అందుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తన అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
‘గద్దర్ అవార్డు వేడుకను నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి(Telangana government) నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు, నిర్మాత దిల్ రాజుకు ధన్యవాదాలు. ఈ అవార్డు నాకు దక్కడానికి ముఖ్య కారణం దర్శకుడు సుకుమార్(Director Sukumar). ఆయన వల్లే ఇది సాధ్యమైంది. ‘పుష్ప 2′ టీమ్ మొత్తానికి థాంక్స్’ అని తెలిపారు. ‘పుష్ప చిత్రాన్ని హిందీలో విడుదల చేయమని దర్శకుడు రాజమౌళి(Director Rajamouli) చెప్పకపోయి ఉంటే ఇంతటి ఆదరణ దక్కేది కాదు. ఈ సందర్భంగా ఆయనకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ‘పుష్ప 2′ చిత్రానికి నేను అందుకుంటున్న తొలి అవార్డు ఇది, అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకం’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇది సినిమా అవార్డు వేడుక కాబట్టి సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెబుతానంటూ, ముఖ్యమంత్రి, ఇతర పెద్దల అనుమతి కోసం వారి వైపు చూశారు. అందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి “గో ఎహెడ్” అంటూ వెంటనే అంగీకరించారు. దీంతో అల్లు అర్జున్ Allu Arjun “నా బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా…” అనే డైలాగ్ చెప్పారు. చివరలో జై తెలంగాణ, జై హింద్ అంటూ ముగించారు.