అక్షరటుడే, తిరుమల: శ్రీవారి మెట్టు(Srivari Mettu) మార్గంలో కాలినడకన వెళ్లే దివ్యదర్శనం భక్తులకు టోకెన్లను అక్కడే జారీ చేయడం వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారనే ఫిర్యాదుతో భూదేవి కాంప్లెక్స్ కు మార్చారు. ఈ మేరకు టీటీడీ ఈవో తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్(Alipiri Bhudevi Complex) లో నిత్యం 5,000 టోకెన్ల వరకు జారీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
అలిపిరిలో పటిష్టంగా టోకెన్ల జారీ యంత్రాంగం, భక్తులకు సౌకర్యవంతంగా రవాణా సౌకర్యం, భద్రత ఉందని ఈవో తెలిపారు. శ్రీనివాస మంగాపురంలో టోకెన్లు జారీ చేసేందుకు ఆర్కియాలజీ శాఖ అనుమతులు రాగానే అక్కడ ప్రక్రియ చేపడతామన్నారు.
కాలినడకన శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లేందుకు భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్లు పొందుతున్న భక్తులతో టీటీడీ ఈవో మాట్లాడారు. దివ్యదర్శనం(Divya Darshan) భక్తులకు టోకెన్ల జారీలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని భక్తులను అడిగి తెలుసుకున్నారు.

టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో సమీక్ష అనంతరం ఈవో జె శ్యామలా రావు(TTD EO Sri J Shyamala Rao) ఉన్నతాధికారులతో కలసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్(Alipiri Toll Plaza Center)ను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో ఆయన మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ల జారీని పరిశీలించారు.
ఆయన వెంట టీటీడీ అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సీవీ అండ్ ఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సీఈ టీవీ సత్యనారాయణ తదితర అధికారులు ఉన్నారు.