అక్షరటుడే, వెబ్డెస్క్: Engineering Admissions | తెలంగాణ ఈఏపీ సెట్ (ఇంజినీరింగ్) అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో(Engineering Courses) ప్రవేశాల కోసం ఎంతో మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ను ఖరారు చేసింది. ఈ నెల 28 నుంచి మొదటి విడత ఇంజినీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్(Engineering Admissions Counseling) చేపట్టనున్నట్లు తెలిపింది. జూలై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చు. జులై 18న మొదటి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈఏపీసెట్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్(Agriculture), ఫార్మసీ ఎంట్రెన్స్(Pharmacy Entrance) కోసం ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం మే 2 నుంచి 4 వరకు ఆరు సెషన్లలో ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలు సీబీటీ CBT (ఆన్లైన్) విధానంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,88,388 విద్యార్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలను సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మే 11న విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 73.29శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ క్రమంలో తాజాగా ఉన్నత విద్యామండలి ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది.