అక్షరటుడే, వెబ్డెస్క్: Airline passengers | అహ్మదాబాద్ విమాన దుర్ఘటన (Ahmedabad Plane Crash) అనంతరం పలు విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణం అంటేనే భయాందోళన కలిగించే పరిస్థితి నెలకొంది. మంగళవారం అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI-159 విమానం సాంకేతిక లోపం కారణంగా రద్దయింది. ఈ విషయాన్ని ఎయిర్లైన్ అధికారులు ధ్రువీకరించారు. ఈ మార్గంలోనే ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. జూన్ 12న జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో సహా 274 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రభావిత విమానానికి కొత్త నంబర్ ఇచ్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్కు వెళ్లే మార్గంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విమానం AI-171 కాగా, ఇప్పుడు AI-159 విమానంతో భర్తీ చేశారు. ప్రాణాంతక విమాన ప్రమాదాల తర్వాత ఇటువంటి సంఖ్యలను మార్చడం సాధారణ పద్ధతి అని మాజీ ఎయిర్లైన్ ఎగ్జిక్యూటివ్ ఒకరు అన్నారు,
Airline passengers | బాంబు బెదిరింపుతో ఎమర్జెన్సీ ల్యాండింగ్..
మరోవైపు, పలు విమాన సర్వీసులకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజా ఇండిగో (Indigo) విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. మంగళవారం కొచ్చి నుంచి న్యూఢిల్లీకి ఇండిగో విమానం ప్రయాణికులతో బయలుదేరింది. ఆ కొద్దిసేపటికే విమానంలో బాంబు ఉందని.. మరికొన్ని నిమిషాల్లో అది పేలనుదంటూ ఆగంతకులు కొచ్చి విమానాశ్రయానికి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే ఆ విమానాన్ని మళ్లించి.. నాగ్పూర్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. విమానంలోని ప్రయాణికులకు కిందకి దింపేసిన అనంతరం విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తరలించి తనిఖీలు చేపట్టారు. ఈ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావాడంతో వెంటనే మళ్లించామని ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. అలాగే ఈ ఘటనపై కేంద్ర పారిశ్రామిక భద్రత దళాలు, స్థానిక పోలీసులు విచారణ చేపట్టామని ఎయిర్ పోర్ట్ అధికారులు వివరించారు.