అక్షరటుడే, వెబ్డెస్క్: AIR India | అహ్మదాబాద్ విమాన దుర్ఘటన(Ahmedabad plane crash) తర్వాత ఎయిరిండియా విమానయాన సంస్థ చిక్కుల్లో పడింది. ఇప్పటికే తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడం, బుకింగ్స్ తగ్గిపోయిన తరుణంలో తాజాగా పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) నోటీసులు జారీ చేసింది. లైసెన్సింగ్(Licensing), పైలట్లకు విశ్రాంతి ఇవ్వక పోవడం, వంటి లోపాల కారణంగా సిబ్బంది రోస్టరింగ్ బాధ్యత వహిస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించింది. మే 16 & 17 తేదీలలో బెంగళూరు నుంచి లండన్కు రెండు విమానాలను నడిపినందుకు ఎయిర్లైన్కు షోకాజ్ జారీ చేసింది. ఆ సమయంలో ఎయిరిండియాకు ఇచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) ప్రకారం అనుమతించబడిన 10 గంటల కంటే ఎక్కువ సమయం పైలట్లతో డ్యూటీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
AIR India | బాధ్యతారాహిత్యం..
సీనియర్ అధికారులు(Senior officers) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని డీజీసీఏ తెలిపింది. వారిని తొలగించాలని ఆదేశించింది. “లైసెన్సింగ్, సిబ్బందికి విశ్రాంతి ఇవ్వడంలో లోపాలు ఉన్నాయి. విశ్రాంతి ఇవ్వకుండా విమాన సిబ్బందిని షెడ్యూల్ చేసి పంపించడం తీవ్రమైన ఉల్లంఘనే. ఈ లోపాలకు ప్రత్యక్షంగా బాధ్యత వహించే కీలక అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది” అని తెలిపింది. ఆ ముగ్గురిని బాధ్యతల నుంచి తొలగించాలని డీజీసీఏ(DGCA) ఆదేశించింది. సదరు అధికారులపై అంతర్గత క్రమశిక్షణ చర్యలు వేగంగా చేపట్టాలని, ఏయే చర్యలు తీసుకున్నారో 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. షెడ్యూలింగ్ పద్ధతుల్లో దిద్దుబాటు సంస్కరణలు ముగిసే వరకు (ముగ్గురు) అధికారులను నాన్-ఆపరేషనల్(Non-operational) విధులకే పరిమితం చేయాలని సూచించింది.