అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmedabad Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ (Ahmedabad Airport) నుంచి లండన్కు బయలుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని (former Gujarat CM Vijay Rupani) సైతం ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులతోపాటు 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటన వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ చేస్తున్నాయి.
Ahmedabad Plane Crash | దారుణం..
ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమానం… బోయింగ్ 787 రకానికి చెందింది. ఇది అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం(Sardar Vallabhbhai Patel International Airport) నుండి రన్వే 23 మీదుగా మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్ (London) గ్యాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 230 మంది ప్రయాణికులు సహా మొత్తం 242 మంది ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. టేకాఫ్ (take-off) సమయంలో విమానానికి పక్షి ఢీకొని ఉండవచ్చని, దాని కారణంగా విమానం టేకాఫ్కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అంటున్నారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు.
అయితే ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు విమానం నుండి ‘మేడే కాల్’ (Mayday call) జారీ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ప్రాణాపాయకరమైన అత్యవసర పరిస్థితిని సూచించడానికి అంతర్జాతీయంగా రేడియో కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగించే అత్యవసర ప్రక్రియనే ‘మేడే కాల్’ అంటారు. కాగా.. విమానంలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది.