అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ప్రపంచాన్ని బాధలో ముంచేలా చేసింది. ఈ ప్రమాదంలో 241 మంది విమానంలో ఉన్నవాళ్లు, అలాగే విమానం కూలిన ప్రాంతంలో ఉన్న మరికొంత మంది మరణించారు. ఈ దుర్ఘటన తర్వాత తర్వాత ఏదైనా మిగిలి ఉంటే.. అవి ప్రశ్నలు మాత్రమే. విమానం Flight కూలిపోవడానికి సాంకేతిక లోపం కారణమా? నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేదా మన దేశంపై కుట్రతో ఎవరైనా సైబర్ దాడి చేసి.. విమానం కూల్చేశారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్లో ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతుండగా ప్రమాదానికి గురైంది.
Ahmedabad Plane Crash | అంత వేడా..
వాతావరణం కూడా పూర్తి అనుకూలంగా ఉంది. సరిగ్గా టేకాఫ్ అవుతున్నట్లు కనిపించిన విమానం కొంచెం ఎత్తుకు చేరుకున్న తర్వాత ఎలా పడిపోయింది? ఫ్లాప్లను తప్పుగా అమర్చడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఇంజిన్కు తక్కువ థ్రస్ట్ పవర్ వచ్చిందా? లేదా 3505 మీటర్ల రన్వే నుండి సమయానికి ముందే విమానం టేకాఫ్ అయిందా? ల్యాండింగ్ గేర్ సమయానికి పైకి లేవలేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా నిర్ధారణకు రాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న SDRF బృందాలు తీవ్రతను వివరిస్తూ, సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయని పేర్కొన్నాయి. మంటల తీవ్రత కారణంగా ఎవ్వరూ పరిసర ప్రాంతానికి చేరుకోలేకపోయారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) మాట్లాడుతూ.. ఆ విమానంలో సుమారు 1.25 లక్షల లీటర్ల విమాన ఇంధనం ఉందని, అది పేలిపోవడం వల్ల మంటలు క్షణాల్లో వ్యాపించాయని వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఉష్ణోగ్రత సుమారు 1000 డిగ్రీల సెల్సియస్కు చేరిందని, ఎవరూ బయటపడే అవకాశం లేకుండా మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల మధ్య SDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అప్పటికే కొంతమంది ప్రాంత ప్రజలు కొందరిని శిథిలాల నుంచి బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. అయితే మంటలు అనూహ్యంగా వ్యాపించడంతో సహాయక చర్యలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒక అధికారి మాట్లాడుతూ, “ఇంతటి విపత్కరమైన దృశ్యం మేము గతంలో ఎప్పుడూ చూడలేదు. విమానం పూర్తిగా అగ్నికి ఆహుతయిన తర్వాత ఆ ప్రాంతంలోని పక్షులు, కుక్కలు కూడా మంటల నుంచి తప్పించుకోలేకపోయాయి. చుట్టూ అన్నీ శిథిలాలే. మంటల్లో కాలిపోయిన ప్రయాణికుల మృతదేహాల గుర్తింపు కూడా ఒక పెద్ద సవాలుగా మారింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.