అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Raid | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ (ACB) వలకు చిక్కారు. ఎంతమంది అధికారులను ఏసీబీ పట్టుకుంటున్నా మిగతా వారు కనీసం భయ పడటం లేదు. ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తునే ఉన్నారు. ఒక వ్యక్తి అద్దె వాహనానికి సంబంధించిన బిల్లులు సిద్ధం చేయడానికి లంచం అడిగిన పీఆర్ ఏఈ (PR AE), సీనియర్ అసిస్టెంట్ను మంగళవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
కరీంనగర్ (Karimnagar)లోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగం కార్యనిర్వహణ ఇంజినీర్ (పంచాయతీ రాజ్) కార్యాలయంలో శరత్ సహాయ ఇంజినీర్గా, వేణుగోపాల్ సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. అద్దె వాహనం బిల్లులు కోసం ఓ వ్యక్తి ఇటీవల వీరిని కలిశాడు. దీంతో ఆరు నెలల పెండింగ్ అద్దె బిల్లులు సిద్ధం చేయడానికి ఏఈ, సీనియర్ అసిస్టెంట్ రూ.8 వేల లంచం (Bribe) అడిగారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం లంచం తీసుకుంటుండగా ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.