అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasingh | బీజేపీ(BJP)లో కొంతకాలంగా నిరసన గళం వినిపిస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh)పై ఆ పార్టీ పెద్దలు చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
హిందుత్వ వాదంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజాసింగ్. ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (brs)ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని కవిత(kavitha) వ్యాఖ్యానించగా.. రాజాసింగ్ కూడా ఆమె మాట్లాడింది నిజమే అన్నారు. తమ పార్టీలో అమ్ముడుపోయే నాయకులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
గతంలో సైతం రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎంలతో రహస్య సమావేశాలు నిర్వహించని వారికి పదవి ఇవ్వాలని కోరారు. కొంతకాలంగా సొంత పార్టీ నేతలే టార్గెట్గా రాజాసింగ్ విమర్శలు చేస్తుండడంపై హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లాయి.
ప్రధానంగా కవిత వ్యాఖ్యలకు రాజాసింగ్ మద్దతు ఇవ్వడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తదనంతరం ఆయనపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. గతంలోనూ రాజాసింగ్ ను కొద్ది రోజుల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఎటువంటి చర్యలు ఉంటాయోనని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.