అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindhur : పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇండియన్ ఆర్మీ యుద్ధ రంగంలోకి దిగి, బాంబుల మోత మోగించింది. పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఉగ్రస్థావరాలను మట్టి కరిపించింది.
Operation Sindoor | ఈ ఆపరేషన్ కు సింధూర్ పేరు ఎందుకు..?
పహల్గామ్ దాడిలో ముష్కరులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచి వేశారు. ఆ స్వరూపిణుల సింధూరం శక్తి తెలియజెప్పేందుకే ఈ ఆపరేషన్కు ‘సింధూర్’ అని నామకరణం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కళ్లముందే భర్తలను కోల్పోయిన అమాయక మహిళలకు చేసే న్యాయడమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం. ఆ అర్థం వచ్చేందుకే కేంద్రం ఈ ఆపరేషన్కు ఆ పేరు ఖరారు చేసింది.
దీనికి తోడు కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి చెందిన కశ్మీర్ లోయలో పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ రక్తం పారించింది. ఆ ఉగ్రదాడికి జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది భారత్ సైన్యం. ఉగ్రదాడి తర్వాత బిహార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చినట్లుగానే ఉగ్రవాదుల స్థావరాల్లో వారికి ఘోరీ కట్టేశారు.
కొన్ని రోజులుగా పక్కా సమాచారాన్ని సేకరించి ఉగ్రస్థావరాలను నిర్ధారించుకుని మరీ భారత్ దాడికి దిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పరిధి ముజఫరాబాద్లోని ఉగ్రవాద స్థావరాలపై సాయుధ దళాలు దాడులు చేపట్టాయి. మన గడ్డపై హింసను సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న కీలక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లకుండా, కేవలం ఉగ్రవాద అడ్డాలే లక్ష్యంగా.. పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్స్తో ఈ ఆపరేషన్ విజయవంతం చేసింది భారత్.