అక్షరటుడే, వెబ్డెస్క్:Telangana Government | రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగి పోయింది. నెలనెలా వేతనాలు ఇవ్వడమే గగనంగా మారింది. ఆదాయం అంతంత మాత్రమే వస్తుండడంతో ప్రతి నెలా అప్పులు చేస్తేనే గానీ పథకాలు, వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నదాంట్లోనే ఏదో విధంగా ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఇటీవల వెల్లడించారు. బడ్జెట్ పద్మనాభంలా తమ పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఆదాయాన్ని వేతనాలు, పథకాల కొనసాగింపునకు సర్దుబాటు చేయడం తలకు మించిన భారంగా మారిందని వాపోయారు. రాష్ట్ర ఆర్థిక స్థితికి ఆయన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు రేవంత్రెడ్డి.. సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు(IAS officer Ramakrishna Rao) భుజాలపై మోపారు. ఆర్థిక శాఖపై విశేష అనుభవం, పట్టు కలిగిన ఆయనను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ క్రమంలో కొత్త సీఎస్(CS) రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
Telangana Government | దిగజారిన ఆర్థిక పరిస్థితి
తెలంగాణ(Telangana) ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. వచ్చే ఆదాయానికి, పెట్టే ఖర్చుకు భారీగా వ్యత్యాసముంది. ఈ క్రమంలో రెవెన్యూ లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సగటున రూ.18 వేల కోట్లు ఉంటుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకే రూ.6,500 కోట్లు పోతున్నాయి. ఇక, గతంలో కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) చేసిన అప్పులకు మిత్తీల రూపంలో రూ.6,500 కోట్లు కడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అవి పోగా మిగిలిన రూ.5,500 కోట్లతోనే పింఛన్లు, ఇతర పథకాలకు ఖర్చు చేస్తున్నామని పేర్కొంటున్నారు.
Telangana Government | అంచనాలు తారుమారు..
రాష్ట్రంలో ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో అన్ని రంగాలు కుదేలయ్యాయి. రెండేళ్లుగా రియల్ ఎస్టేట్(Real Estate) కుదేలైంది. దీనిపై ఆధారపడిన ఇతర వ్యాపారాలు కూడా దెబ్బ తిన్నాయి. అధిక ఆదాయం ఇచ్చే రెవెన్యూ, స్టాంప్లు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అంతంత మాత్రమే వస్తోంది. దీనికి తోడు కేంద్రం నుంచి నిధులు సరిగ్గా రావడం లేదు. భూములు విక్రయించి ఆదాయం సమకూర్చుకోవాలనుకుంటే ఆ అవకాశం లేకుండా ప్రతిపక్ష పార్టీలు కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాయి. 2024-25లో ట్యాక్స్ రెవెన్యూ(Tax Revenue) రూ.1.60 లక్షల కోట్లు వస్తుందని బడ్జెట్లో అంచనాలు వేస్తే అవి తలకిందులయ్యాయి. 1.24 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. స్టాంప్ డ్యూటీ రూ.13,500కోట్లు అంచనా వేస్తే వచ్చింది రూ.7918 కోట్లు మాత్రమే. జీఎస్టీ రూ.52 వేల కోట్లకు 44 వేల కోట్లు మాత్రమే వచ్చింది. సేల్స్ ట్యాక్స్(Sales Tax) రూ.24,500 కోట్లకు రూ.15,792 కోట్లు మాత్రమే వచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రభావం ఎక్సైజ్(Excise) మీద కూడా పడింది. ఈ రంగంలో రూ.25,597 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే వచ్చింది కేవలం రూ.16,966 కోట్లు మాత్రమే. ఇలా రాష్ట్ర రెవెన్యూ రూ.2.01 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేసిన రేవంత్ ప్రభుత్వానికి 2024-25లో వచ్చిన ఆదాయం రూ.1.41 కోట్లే.. ఇందులో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ కూడా ఉన్నాయి. మరోవైపు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయంలో ప్రధానంగా భూముల అమ్మకాల మీదనే వస్తుంది. బీఆర్ఎస్(BRS) పాలనలో వచ్చిన దాంట్లో ఇప్పుడు సగం కూడా రాలేదు. 2024-25లో బడ్జెట్లో రూ.10.576కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, వచ్చింది రూ.4.492 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ పాలనలో నాన్ ట్యాక్స్ రెవెన్యూ (భూముల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం) 2022-23లో రూ.19,553 కోట్లు, 2023-24లో రూ.23,819 కోట్లు కాగా, రేవంత్ పాలనలో వచ్చిన ఆదాయం రూ.4,492 కోట్లే.
Telangana Government | నిలిచిన హెచ్సీయూ భూముల విక్రయం
భూముల అమ్మకం ద్వారా డబ్బులు సమకూర్చుకోవాలనుకున్న ప్రభుత్వ ఆశలపై అటు ప్రతిపక్షాలు, ఇటు కోర్టు కలిసి నీళ్లు చల్లాయి. గతంలో ఐఎంజీకి కేటాయించిన భూములు తిరిగి ప్రభుత్వానికి రావడంతో అందులో 400 ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం(Government) నిర్ణయించింది. తద్వారా దాదాపు రూ.30 నుంచి రూ.40 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావించారు. కానీ, యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలు, బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం, కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ భూమి విక్రయం ఆగిపోయింది.
Telangana Government | సీఎస్ ఏం చేస్తారో..
ఆదాయం తగ్గిపోవడం, రెవెన్యూ లోటు పెరిగి పోయిన తరుణంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు(Ramakrishna Rao) ఆర్థిక వ్యవస్థను ఏవిధంగా గాడిన పెడతారాన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదాయాన్ని పెంచడంతో పాటు సంక్షేమ పథకాల అమలుకు నిధులు సమకూర్చడం సీఎస్(CS) పనితీరుపైనే ఆధారపడి ఉంది. విపరీతంగా అప్పులు చేశారని బీఆర్ఎస్(BRS)ను విమర్శిస్తున్న కాంగ్రెస్ పాలకులకు అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అప్పులు చేస్తుండడంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏం చేస్తారన్నది కూడా చర్చనీయాంశమైంది. 14 రాష్ట్ర బడ్జెట్ల రూపకల్పనలో భాగస్వాములైన 1991 బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు ఆర్థిక శాఖపై ఎనలేని పట్టుంది. ఆయన తను అనుభవంతో ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా గాడిలో పెడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, హెచ్సీయూ భూముల(HCU Lands) వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించి ముందుకెళ్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.