అక్షరటుడే, వెబ్డెస్క్: Operation Kagar | ఆపరేషన్ కగార్ పేరిట భద్రలా బలగాలు దండకారాణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోల ఏరివేత లక్ష్యంగా ఛత్తీస్గడ్ (Chhattisgarh) సరిహద్దుల్లో వేలాది బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.
అయితే, వందలాది మందిని హతమారుస్తున్నా కీలక నేతలను మట్టుబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించట్లేదు. చిక్కినట్లే చిక్కి తప్పించుకు పోతుండడంతో పోలీసులు(Police) తలలు పట్టుకుంటున్నారు. ప్రధానంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ మాద్వి హిడ్మా(Madvi Hidma) పోలీసులకు చుక్కలు చూపుతున్నాడు. ఎన్ని ఎత్తులు వేసినా, వేలమంది వెంటాడుతున్నా చిక్కకుండా తప్పించుకుంటూ సవాల్ విసురుతున్నాడు.
Operation Kagar | అంచెలంచెలుగా ఎదిగిన హిడ్మా
దాదాపు మూడు దశాబ్దాల పాటు చత్తీస్గఢ్ కేంద్రంగా పని చేస్తున్న హిడ్మా(Hidma)కు వ్యూహాలు రచించడంతో సిద్ధహస్తుడన్న పేరుంది. 17 ఏళ్ల వయస్సులోనే అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. మావోయిస్టు పార్టీ(Maoist Party)లో సాధారణ కార్యకర్త నుంచి నిర్ణయాత్మక కమిటీ అయిన కేంద్ర కమిటీ వరకు ఎదిగాడు. నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీలో విశ్వాసం నింపడం కోసం కొత్త తరహా ప్రణాళికలు రూపొందించాడు. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్(Most Wanted)గా మారాడు. నాలుగు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్న అతని తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
Operation Kagar | గెరిల్లా యుద్ధతంత్రాలకు పెట్టింది పేరు..
ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా పూవర్తి గ్రామంలో పుట్టిన హిడ్మా(Hidma) పోలీసుల కంట్లో నలుసుగా మారాడు. ఎంతో మంది బలగాలను హతమార్చడం వెనుక అతని మాస్టర్మైండ్ ఉందని చెబుతారు. వందలాది మంది మిలిటెంట్లను గెరిల్లా యుద్ధతంత్రంలో తీర్చిదిద్దాడు. 2011లో సుకుమా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75 మంది సీఆర్పీఎఫ్(CRPF) జవాన్లు హతమార్చిన సంచలన ఘటన వెనుక హిడ్మా కీలకంగా వ్యవహరించాడు. 2017లో బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందన్న విషయాన్ని మావోయిస్టు పార్టీయే స్వయంగా ప్రకటించింది. 2021లో తెర్రాం వద్ద 23 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపడానికి స్కెచ్ వేసింది కూడా హిడ్మాయే.
Operation Kagar | టార్గెట్ హిడ్మా..
కొంతకాలంగా మావోయిస్టు(Maoist)లపై బలగాల ఆధిపత్యం బాగా పెరిగిపోయింది. వరుస ఎన్కౌంటర్లలో వందలాది మంది హతమవ్వడంతో కేడర్లో విశ్వాసం సన్నగిల్లింది. దండకారాణ్యంలో పట్టున్న అనేక కీలక ప్రాంతాలు బలగాల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పాగా వేసిన మావోలను మట్టుబెట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్(Operation Kagar)కు శ్రీకారం చుట్టింది.
వచ్చే మార్చి నాటికి నక్సల్స్ సమస్యను అంతమొందించాలన్న లక్ష్యం మేరకు బలగాలు దండకారణ్యంపై దండెత్తాయి. మావోలకు కంచుకోటగా భావించే కర్రెగుట్టలను టార్గెట్ హిడ్మా(Target Hidma) పేరుతో 20వేల మందితో కూడిన బలగాలు చుట్టుముట్టాయి. వెయ్యి మందికి పైగా మావోలు కర్రెగుట్ట(Karre Gutta)ల్లో ఉన్నారన్న సమాచారం మేరకు పది రోజులుగా జల్లెడ పట్టాయి. అయితే, హిడ్మా తృటిలో తప్పించుకుపోవడంతో బలగాలు నిరాశలో కూరుకుపోయాయి.