అక్షరటుడే, న్యూఢిల్లీ: Char Dham Yatra : పహల్ గామ్ దాడి తర్వాత పర్యాటక ప్రాంతాలతో పాటు.. ప్రముఖ యాత్రా స్థలాల్లోనూ కేంద్ర సర్కారు భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా చార్దామ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భారీగా భద్రతా దళాలను మోహరించింది. చార్ దామ్ యాత్రలో భాగంగా ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి యాత్ర ప్రారంభమైంది. కేదార్నాథ్ మే 2న, బద్రీనాథ్ మే 4న తెరవనున్నారు. ఈ యాత్ర ఆరు నెలలపాటు అంటే అక్టోబరు – నవంబరు వరకు కొనసాగనుంది.
పహల్ గామ్ ఘటన తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ సంయుక్తంగా చార్దామ్ యాత్ర కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. కీలక ప్రదేశాలైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల చుట్టూ భద్రతను పెంచాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు, రాష్ట్ర పోలీసులతో సహా వేలాది మంది సిబ్బంది ఈ ఆలయాల వద్ద మోహరించారు. ఆలయాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాలు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు బిగించారు. హిమాలయ ప్రాంతంలోని క్లిష్టమైన దారుల్లో డ్రోన్లతో నిఘా ఉంచారు.
యాత్రికుల భద్రత కోసం ఈసారి ఫొటోమెట్రిక్, బయోమెట్రిక్ నమోదు తప్పనిసరిగా చేశారు. ఆధార్ కార్డు ఆధారిత రిజిస్ట్రేషన్ అమల్లోకి తెచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం టూరిస్టు కేర్ ఉత్తరాఖండ్ యాప్ ను అందుబాటులో ఉంచారు.
ప్రతి ఆలయం సమీపంలో వైద్య సిబ్బంది, అగ్నిమాపక అధికారులతో కూడిన రెస్పాన్స్ బృందాలను ఉంచారు. హెలికాప్టర్ రెస్క్యూ సర్వీసు అందుబాటులో ఉంది. చార్దామ్ యాత్ర మార్గాల్లోని రిషికేశ్, హరిద్వార్, గర్వాల్, ఉత్తరకాశీ వంటి ప్రాంతాల్లో పోలీసు గస్తీని పెంచారు. యాత్రికుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.