అక్షరటుడే, వెబ్డెస్క్:DCC | జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)ల నియామకంలో కాంగ్రెస్ నాయకత్వం సరికొత్త సంస్కరణలకు తెరలేపింది. ఎంపిక కాకుండా ఎన్నిక ద్వారానే డీసీసీ అధ్యక్షులను(DCC presidents) నియమించాలని మెలిక పెట్టింది. తద్వారా ఆశావహులకు అధికార పార్టీ ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది.
ఎన్నికల ద్వారానే నూతన అధ్యక్షులను నియమించాలని నిర్ణయించడంతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy)కి చెక్ పెట్టేలా అధిష్టానం మరో నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షులుగా పోటీ చేసే వారు 2017కు ముందు నుంచే పార్టీలో ఉండాలని నిబంధన పెట్టింది. తద్వారా రేవంత్ అనుచరులకు డీసీసీ ఎన్నికల్లో పాల్గొనకుండా అవకాశం లేకుండా చేసినట్లు చెబుతున్నారు.
DCC | తొలిసారి కొత్త విధానం
క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ నాయకత్వం(Congress leadership) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యవర్గాలను నియమించే పనిలో పడింది. రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత పీసీసీ(PCC) పదవిని నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్కుమార్గౌడ్(Mahesh Kumar Goud)కు కట్టబెట్టింది. ఆ తర్వాత కొంత మంది సీనియర్లకు పీసీసీ కార్యవర్గంలోకి చోటిచ్చింది. తాజాగా జిల్లా కాంగ్రెస్ కమిటీల నియామకంపై దృష్టి సారించిన అధిష్టానం.. ఈసారి కొత్త విధానానికి తెర తీసింది. ఎన్నికల ద్వారానే డీసీసీ అధ్యక్షులను నియమించాలని నిర్ణయించింది. గతంలో పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుని, ఎవరినో ఒకరిని నాయకత్వమే ఎంపిక చేసేది. కానీ ఈసారి మాత్రం ఎన్నికలు నిర్వహించాలని హైకమాండ్ (High command) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అబ్జర్వర్లను సైతం నియమించింది.
DCC | పోటీ ఎక్కువే..
దాదాపు పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎన్నో నిర్బంధాలు ఎదురైనప్పటికీ సీనియర్ నేతలు పార్టీని కాపాడుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే, అలాంటి వారిలో కొందరికే నాయకత్వంలో ప్రభుత్వం అవకాశం కల్పించింది.
నామినేటెడ్ పదవుల్లో nominated posts అవకాశం రాక, పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్న తమకే అవకాశం లభిస్తుందని ఆశ పడిన వారికి హైకమాండ్(High Command) షాక్ ఇచ్చింది. ఎంపిక కాకుండా ఎన్నిక నిర్వహించాలన్న నిర్ణయం వారికి ఆశనిపాతంలా మారింది. సామాజిక సమీకరణాలతో పాటు అంగ, అర్థబలం ఉంటేనే పోటీలో నెట్టుకువచ్చే అవకాశముంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా డీసీసీ అధ్యక్ష ఎన్నికకు కనీసం ఐదుగురి కంటే ఎక్కువే పోటీలో ఉండే అవకాశముంది.
DCC | రేవంత్కు చెక్ పెట్టేందుకేనా?
డీసీసీ(DCC)లకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ నాయకత్వం మరో మెలిక కూడా పెట్టింది. 2017 నాటికి పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారే పోటీకి అర్హులని కండిషన్ పెట్టింది. తద్వారా సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy)కి చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 2017లోనే రేవంత్రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత క్రమంగా ఎదిగిన ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే రీతిలో పోరాటం చేశారు. ప్రజలకు దూరమైన కాంగ్రెస్ను మళ్లీ పట్టాలెక్కించారు. పాదయాత్రలతో ప్రజల్లో ఉంటూ పదునైన విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వాన్ని(KCR government) ఇరుకున పెట్టారు. 2018 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై పార్టీని ముందుకు నడిపించారు.
ఊహించని రీతిలో బీఆర్ఎస్(BRS)ను ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో హైకమాండ్ ఎంతో మంది సీనియర్లు ఉన్నా రేవంత్(Revanth)కే సీఎంగా బాధ్యతలు అప్పగించింది. తొలినుంచి రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సన్నిహితంగా ఉంటున్న రేవంత్కు.. పాలనలో, పార్టీలో మంత్రులు, నేతల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న ప్రచారం ఉంది. అదే సమయంలో రేవంత్కు వ్యతిరేకంగా కొందరు నాయకులు అధిష్టానం వద్ద తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ సర్కారు(Congress Government) తీసుకున్న హైడ్రా, హెచ్సీయూ భూముల వివాదం వంటి కొన్ని నిర్ణయాలు తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నాయి. దీన్ని మరింత ఎక్కువగా చూపుతూ రేవంత్పై ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయడంతో అధిష్టానం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎంకు చెక్ పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ ఇన్చార్జీగా మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు బాధ్యతలు అప్పగించింది. తాజాగా డీసీసీల ఎంపికలో కొత్త విధానాన్ని అమలు చేయడం కూడా రేవంత్కు చెక్ పెట్టేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.