అక్షరటుడే, వెబ్డెస్క్ : Dharmasthala | దశబ్దాల పాటు మహిళలు, యువతులను హత్య చేసి తన చేత బలవంతంగా ఖననం, దహనం చేయించారని కర్ణాటకలో ఓ వ్యక్తి ఆరోపించిన విషయం తెలిసిందే. 1995 నుంచి 2014 వరకు తన చేత వందలాది మంది మహిళలు, యువతుల మృతదేహాలను పూడ్చి పెట్టించారని గతంలో పారిశుధ్య కార్మికుడి (Sanitation worker)గా పని చేసిన వ్యక్తి పోలీసులకు లేఖ రాశాడు. ఈ లేఖ ఇప్పుడు కర్ణాటకలో (Karnataka) తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Dharmasthala | అసలు ఏం జరిగిందంటే?
దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలలోని (Dharmasthala) ఆలయంలో ఓ వ్యక్తి పారిశుధ్య కార్మికుడిగా పని చేసేవాడు. సదరు వ్యక్తి ఇటీవల పోలీసులకు లేఖ రాశాడు. దశాబ్ద కాలంగా లైంగిక వేధింపులకు గురైన వందలాది మంది మహిళల మృతదేహాలను తాను ఖననం చేసి దహనం చేశానని పేర్కొన్నాడు. ఆయన ఒక మృతదేహాన్ని కూడా వెలికితీసి పోలీసులకు అప్పగించాడు. 1995–2014 మధ్య ధర్మస్థల ప్రాంతంలో అనేక హత్యలు జరిగాయని సదరు వ్యక్తి ఆరోపించాడు. తనతో బలవంతంగా శవాలను పాతిపెట్టించారని పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన ఇటీవల న్యాయమూర్తి ఎదుట హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చాడు.
Dharmasthala | చంపేస్తామని బెదిరించారు..
ఈ హత్యల విషయాన్ని 1998లో పోలీసులకు చెప్పడానికి ప్రయత్నించగా ఓ ఉన్నతాధికారి తనను చంపేస్తానని బెదిరించాడన్నారు. మహిళలు, యువతుల మృతదేహాల్లో కొన్నింటిని డీజిల్తో కాల్చానని, మరికొన్నింటిని పాతి పెట్టానని ఆయన వివరించాడు. మృతుల్లో ఎక్కువ మంది బాలికలు, యువతులే ఉన్నారని తెలిపాడు. వాళ్లను లైంగికంగా హింసించి చంపినట్లు కనిపించిందన్నారు. 2014లో తాను రాష్ట్రం నుంచి పారిపోయానని, అపరాధ భావంతో ఇప్పుడు నిజం చెబుతున్నట్లు ఆయన తెలిపారు. దీని వెనక పెద్దల హస్తం ఉందని ఆ వ్యక్తి ఆరోపించారు.
Dharmasthala | అన్ని వర్గాల నుంచి ఒత్తిడి రావడంతో..
మాజీ పారిశుధ్య కార్మికుడు చెప్పిన విషయాలతో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో సహా పలువురు ప్రముఖులు ఈ విషయంపై సిట్ ఏర్పాటు చేసి సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఏర్పాటు చేశారు. దీనికి అసిస్టెంట్ డీజీపీప్రణవ్ మొహంతి నేతృత్వం వహిస్తారు. ఐపీఎస్ అధికారులు అనుచేత్, సోమ్యలత, జితేంద్ర కుమార్ దయామా సభ్యులుగా ఉంటారు. పారిశుధ్య కార్మికుడు చెప్పిన విషయాలతో పాటు ఆ సమయంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులపై వారు దర్యాప్తు చేస్తారు.
Dharmasthala | నా కుమార్తె అప్పుడే మిస్ అయింది
మాజీ పారిశుధ్య కార్మికుడు లేఖ రాసిన తర్వాత ఓ మహిళ తన కుమార్తె అదృశ్యం గురించి చెప్పింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళ తన కుమార్తె 2003లో ధర్మస్థల ఆలయాన్ని సందర్శించిన తర్వాత కనిపించకుండా పోయిందని ఇటీవల ఫిర్యాదు చేసింది. గతంలో తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.