అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కబ్జాకు గురైన తన భూమి తిరిగి దక్కుతుందో లేదోనని బెంగతో కామారెడ్డి జిల్లాలో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన 26 గుంటల భూమి ఓ ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని.. తన ఆత్మహత్యకు వారే కారణమని పేర్లు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం శాబ్దిపూర్ గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి 26 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అధికారుల చుట్టూ తిరగ్గా సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురి వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. అయితే ఆ భూమి కోర్టు పరిధిలో ఉన్నట్టు సమాచారం. భూమి కబ్జా కావడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఆ రైతును వేధించసాగాయి. దీంతో తన భూమి దక్కుతుందో లేదోనన్న భయంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు తన చావు కారణమైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి తన కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని పేర్కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.