అక్షరటుడే, వెబ్డెస్క్ : Karim Nagar | కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలత (Women CI Srilatha)పై కేసు నమోదు అయింది.
ఇటీవల భార్యల వేధింపులు తాళలేక భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. చట్టాలు మహిళలు అనుకూలంగా ఉన్నాయని.. తమకు న్యాయం జరగడం లేదని సెల్ఫీ వీడియో తీసి ఇటీవల పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కరీంనగర్లో చోటు చేసుకుంది.
చొప్పదండి (Choppadandi) మండల కేంద్రానికి చెందిన కడారి శ్రవణ్కుమార్ (34) కు కరీంనగర్ (Karimnagar)కు చెందిన బత్తుల నీలిమాతో వివాహం అయింది. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య కలహాలు రావడంతో 2024లో నీలిమా తన పుట్టింటికి వెళ్లిపోయింది.
అంతేగాకుండా శ్రవణ్పై గృహహింస కేసు పెట్టింది. ఈ కేసులో మహిళా పోలీస్ స్టేషన్ (Women Police Station) సీఐ శ్రీలత తనను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ శ్రవణ్కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Karim Nagar | తండ్రి ఫిర్యాదు మేరకు..
నీలిమా తరఫున బంధువుల ప్రోత్సాహంతో శ్రావణ్ కుమార్పై కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీలతపై ఆరోపణలు ఉన్నాయి. తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు శ్రవణ్ తండ్రి సీఐతో పాటు తన కోడలు నీలిమా మరో ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ జరిపిన పోలీసులు సీఐ శ్రీలతతో పాటు మిగతా వారిపై కేసు నమోదు చేశారు.