అక్షరటుడే, వెబ్డెస్క్: Karnataka Deputy CM | కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మార్పేమీ ఉండదని, ఐదేళ్లు తానే ఉంటానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Chief Minister Siddaramaiah) స్పష్టం చేసి, ఊహాగానాలకు తెర దించినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy Chief Minister DK Shivakumar), పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. కుర్చీ దొరకడం కష్టమని, దొరికినప్పుడు వదలకూడదని డీకే శివకుమార్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన శనివారం మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి మార్పుపై చర్చ సరికాదని తెలిపారు. 2028లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తేవడమే తమ పార్టీ ప్రాధాన్యమని వివరించారు.
Karnataka Deputy CM | సరైన సమయంలో నిర్ణయం..
2028లో తిరిగి అధికారంలోకి రావడమే కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి శివకుమార్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పాత్ర గురించి ప్రజలలో చర్చించడం కాదన్నారు. అదే సమయంలో పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి మార్పుపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ఇప్పుడు ఏమీ చర్చించడం లేదు. పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. ఇది మీడియాలో చర్చించకూడని అంశం. అన్నింటికంటే ముందు, 2028లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే మా పని.” అని తెలిపారు. కర్ణాటకలో నాయకత్వ (Karnataka leadership) మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Karnataka Deputy CM | కుర్చీని వదలొద్దు..
మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Deputy Chief Minister DK Shivakumar) శుక్రవారం చేసిన “కుర్చీ”వ్యాఖ్యలు కొత్త ఊహాగానాలకు తెర లేపింది. శుక్రవారం బెంగళూరు బార్ అసోసియేషన్ నిర్వహించిన నాదప్రభు కెంపెగౌడ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.
నిలబడి ఉన్న లాయర్లను ఉద్దేశించి ఇక్కడ చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, ఈ రోజుల్లో కుర్చీ దొరికితే వదలకూడదన్న అర్థంలో అన్నారు. “ఈ రోజుల్లో కుర్చీ దొరకడం కష్టం. కుర్చీ దొరికినప్పుడు వచ్చి కూర్చోవాలి” అని పేర్కొన్నారు. 2023 మే లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
ఆ సమయంలో రొటేషనల్ సీఎం ఫార్ములాపై ఇరువరు అంగీకరించారని, తొలి విడుత సిద్దరామయ్య, మలి విడుతలో డీకే పదవి చేపట్టాలని అంగీకారం కుదిరిందన్న వార్తలొచ్చాయి. ఈ లెక్కన 2025 నవంబర్లో డీకే బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్నారు. అయితే, సీఎం మార్పుపై అటు అధిష్టానం కానీ, ఇటు సిద్దు కానీ కొట్టి పడేస్తున్నారు.
గురువారం ఢిల్లీలో సిద్ధరామయ్య (CM Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ, కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలను కొట్టిపడేశారు. సీఎం కుర్చీ ఖాళీ లేదన్నారు. “ముఖ్యమంత్రి పదవికి ఏదైనా ఖాళీ ఉందా? నేను మీ ముందు ఉన్నాను. నేను కర్ణాటక ముఖ్యమంత్రిని. శివకుమార్ చెప్పింది అదే, నేను కూడా చెబుతున్నాను… ఖాళీ లేదు” అని ఆయన అన్నారు.