అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కన్న వారిని, కట్టుకున్న వారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. తాత్కాలిక సుఖాలు, ఆనందాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చివరకు కడుపును బిడ్డలను కూడా చంపుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓ కూతురు తన ప్రియుడితో కలిసి తండ్రిని చంపింది. అనంతరం సెకండ్ షో సినిమా (Second Show Movie)కు వెళ్లొచ్చి.. మృతదేహాన్ని చెరువులో పడేసింది.
Hyderabad | భర్త వదిలేయడంతో..
హైదరాబాద్(Hyderabad)లోని ముషీరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన తండ్రిని ఓ యువతి ప్రియుడితో కలిసి హతమార్చింది. ముషీరాబాద్ (Musheerabad)కు చెందిన మనీషా(25)కు గతంలోనే వివాహం అయింది. అయితే ఆమె జావీద్ (24) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త ఆమెను వదిలేశాడు. అయినా జావీద్తో మనీషా సంబంధం కొనసాగిస్తోంది. ఇది నచ్చని ఆమె తండ్రి వడ్లూరి లింగం(45) కూతురిని మందలించి ఇంటికి రమ్మన్నాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడని మనీషా తండ్రిపై పగ పెంచుకుంది.
Hyderabad | కల్లులో మత్తు మందు కలిపి..
తన తండ్రిని చంపడానికి మనీషా ఆమె ప్రియుడు జావిద్ తన తల్లితో కలిసి పథకం పన్నింది. ఇందులో భాగంగా కల్లులో మత్తు మందు కలిపి లింగంకు ఇచ్చారు. ఆయన తాగి పడుకోగానే.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం తన ప్రియుడితో కలిసి మనీషా సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా నుంచి వచ్చాక లింగం మృతదేహాన్ని ఘట్కేసర్ ఏదులాబాద్ చెరువు(Ghatkesar Edulabad Lake)లో పడేశారు. చెరువులో మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు మనీషా ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారదను అదుపులోకి తీసుకున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా పోలీసులు కేసు చేధించారు.
Hyderabad | సమాజం ఎటు పోతుంది
ఇటీవల చోటు చేసుకుంటున్న పలు ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. ప్రేమ, వివాహేతర సంబంధాలతో కొందరు హత్య చేస్తున్నారు. ఇటీవల జీడిమెట్లలో ఓ పదో తరగతి బాలిక ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించిన విషయం తెలిసిందే. గద్వాల్కు చెందిన తేజేశ్వర్ అనే సర్వేయర్ను ఆమె భార్య పెళ్లైన నెల రోజులకు ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఇటీవల ఓ మహిళా మద్యం మత్తులో తన ఐదు నెలల కూతురును చంపేసింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.