అక్షరటుడే, బాన్సువాడ: banswada | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ఓ వ్యాన్ బోల్తా పడగా.. నిన్న ఓ లారీ మూడు కార్లను ఢీకొట్టింది. తాజాగా బుధవారం మరో ప్రమాదం జరిగింది. కంకర లోడ్తో వెళ్తున్న లారీ బీర్కూర్(Birkur) శివారులో బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ నుంచి తిమ్మాపూర్ (Timmapur) వైపు వెళ్తున్న కంకర లారీ అదుపుతప్పి బీర్కూరు శివారులో బోల్తా పడింది. లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
banswada | వరుస ప్రమాదాలు..
ఉమ్మడి జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, నిబంధనలు పాటించకపోవడం వల్ల పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు రాత్రి సయంలో నిద్రమత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కారణం ఏదైనా వరుస ప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఇందల్వాయి శివారులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. వరుసగా మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అంతేకాకుండా సోమవారం నవీపేట్ మండలంలోని మిట్టాపూర్ వద్ద డ్రైవర్ అజాగ్రత్త కారణంగా కల్లు వ్యాన్ బోల్తా కొట్టింది. దీంతో కూలీలు గాయపడ్డారు.