అక్షరటుడే, వెబ్డెస్క్ : Minister Srihari | తనకు కేటాయించిన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి (Minister Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ (Karim Nagar) క్రీడా పాఠశాలలో సోమవారం ఆయన పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. ‘ఇది అదృష్టమో దురదృష్టమో తెలియడం లేదు.. పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు’ అని వ్యాఖ్యనించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion)లో భాగంగా వాకిటి శ్రీహరికి పదవి వరించిన విషయం తెలిసిందే. ఆయనకు పశు సంవర్ధక శాఖ, మత్స్యశాఖ, యువజన సంక్షేమం, క్రీడలు, డెయిరీ డెవలప్మెంట్ శాఖలు ఇచ్చారు.
Minister Srihari | గాడిలో పెడతా..
పదేళ్లలో బీఆర్ఎస్ (BRS) హయాంలో ఆగం చేసిన శాఖలను తనకు అప్పగించారని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉందన్నారు. ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయన్నారు. బర్రెలు, గొర్రెల శాఖలను ఇస్తే.. తాను ఏం చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. గందరగోళంగా ఉన్న శాఖలను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Minister Srihari | గొర్రెల పంపిణీ పేరిట మోసం
బీఆర్ఎస్ హయాంలో ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గొర్రెల పంపిణీ పేరిట పెద్ద స్కాం చేశారన్నారు. ఆ విషయం దేశం అంతా తెలుసని పేర్కొన్నారు. అదే గొర్రెను కొని అమ్మి.. మళ్లీ కొనుగోలు చేశారన్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో గొల్లకుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. చాలా చోట్ల గొర్రెలు కొనుగోలు చేయకుండా అధికారులు, బ్రోకర్లతో కుమ్మక్కై డబ్బులు పంచుకున్నారు. దీంతో గందరగోళంగా ఉన్న శాఖను తనకు అప్పగించారని వాకిటి శ్రీహరి అన్నారు.
Minister Srihari | చేపల పంపిణీలో..
బీఆర్ఎస్ హయాంలో చెరువులో ఉచితంగా చేప పిల్లలు వదిలేవారని మంత్రి పేర్కొన్నారు. అయితే మూడు లక్షల చేప పిల్లలు వదిలామని అధికారులు చెబితే.. మూడు వేలు మాత్రమే పెరిగేవి అన్నారు. అలాగే యువజన సర్వీసులు, క్రీడల శాఖ తనకు కేటాయించారని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇప్పుడు తాను నియామకాలు ఎలా చేపట్టాలన్నారు. ఆయా శాఖలను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.