అక్షరటుడే, న్యూఢిల్లీ: Army Officer : భారతదేశానికి ఉన్న ఒక సరిహద్దు సమస్య కారణంగా ముగ్గురు శత్రువులు తయారయ్యారని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (కెపాబిలిటీ డెవలప్మెంట్ & సస్టెనెన్స్) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ (Deputy Chief of Army Staff Rahul R Singh) అన్నారు. పాకిస్తాన్(Pakistan), చైనా(China), టర్కీ(Turkey)ల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఎదురైన ఆధునిక యుద్ధ సవాళ్ల దృష్ట్యా భారతదేశం తన వైమానిక రక్షణ, సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ‘ న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్’(New Age Military Technologies) అంశంపై ఫిక్కీ నిర్వహించిన ఉన్నత స్థాయి రక్షణ కార్యక్రమంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Army Officer : పాక్కు చైనా సహకారం..
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చైనా సహకరించిందని, భారత్ కు చెందిన కీలకమైన సైనిక మోహరింపులపై రియల్ టైమ్ సమాచారం అందించిందని సింగ్ తెలిపారు. మన ముఖ్యమైన నిఘా సమాచారం తమ వద్ద ఉందని, తదుపరి చర్యలకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని డీజీఎంవో(DGMO) స్థాయి చర్చలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ బహిరంగంగానే చెప్పిందన్నారు. పాకిస్తాన్, చైనా రియల్ టైమ్లో సమన్వయం చేసుకుంటుండడం భారతదేశానికి తీవ్రమైన వ్యూహాత్మక సవాలుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మనం వేగంగా స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మరోవైపు, ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ కూడా కీలక పాత్ర పోషించిందని లెఫ్టినెంట్ జనరల్ సింగ్ గుర్తు చేశారు. ఘర్షణ సమయంలో టర్కీ పాకిస్తాన్ కు బలమైన మద్దతు ఇచ్చిందన్నారు. శిక్షణ పొందిన వ్యక్తులతో పాటు బేరక్తర్ డ్రోన్లు, అనేక ఇతర మానవరహిత వైమానిక వ్యవస్థలను సరఫరా చేసిందని వెల్లడించారు.
Army Officer : ఏకమవుతున్న శత్రువులు
ఒకే సరిహద్దులో ముగ్గురు శత్రువులతో పోరాటం చేయాల్సి వస్తున్నదని సింగ్ తెలిపారు. “పాకిస్తాన్ ముందు వరుసలో ఉంది, చైనా సాధ్యమైన అన్ని రకాల మద్దతును అందిస్తోంది. టర్కీ ప్రమేయం కూడా స్పష్టంగా ఉంది” అని అన్నారు. పాకిస్తాన్ వినియోగిస్తున్న మిలిటరీ హార్డ్వేర్ లో 81% చైనా నుంచే దిగుమతి అవుతోందని తెలిపారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ భారత్ పై పాక్ నిర్వహించిన దాడుల్లో చైనా తన ఆయుధాలను పరీక్షించుకుందని చెప్పారు. అదే సమయంలో పాకిస్థాన్కు టర్కీ సైతం అదే తరహాలో సహాయం చేసిందన్నారు. ఈ యుద్ధంలో టర్కీ పైలట్లు నేరుగా పాల్గొన్నారని వివరించారు.
Army Officer : బలమైన రక్షణ వ్యవస్థ అవసరం..
శత్రువులు ఏకమవుతున్న తరుణంలో మన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సింగ్ తెలిపారు. పెరుగుతున్న డ్రోన్ల ముప్పు, ఆధునిక యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడానికి బలమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాక్, చైనాను ఎదుర్కొవడానికి బలమైన వాయు రక్షణ వ్యవస్థ ఉండాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. ఉగ్రవాద స్థావరాలను గుర్తించి.. వాటిని ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత సైనిక బలగాలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అలాగే ఈ ఆపరేషన్ సిందూర్ వల్ల కొన్ని పాఠాలను సైతం నేర్చుకున్నామని చెప్పారు. మానవ మేథస్సుతోపాటు సాంకేతిక ద్వారా లెక్కలేనంత సమాచారాన్ని సేకరించి.. ఈ దాడులు నిర్వహించామని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వివరించారు. గతంలో మాత్రం ఇలా సమాచారాన్ని సేకరించడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న మాట మాత్రం వాస్తవమన్నారు. అయితే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో 21 లక్ష్యాలను గుర్తించి.. వాటిలో తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. అందుకు చివరి రోజు.. చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. త్రివిధ దళాలు ఐక్యత కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.
Army Officer : మాస్టర్ స్ట్రోక్ నిర్ణయమది..
రెండు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సింగ్ ప్రశంసలు కురిపించారు. యుద్ధం ప్రారంభించడం సులభమే అయినప్పటికీ, దానిని నియంత్రించడం కష్టమని నొక్కి చెప్పారు. సరైన సమయంలో ఆపరేషన్ ఆపాలనే భారత నాయకత్వం నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ గా ఆయన అభివర్ణించారు.