అక్షరటుడే, వెబ్డెస్క్ : Maharashtra | చదువు మనిషికి అవసరమే కానీ, అది జీవితం కాదు. కానీ మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ గ్రామంలో చదువు కోసం కొంతమంది చిన్నారులు ప్రాణాలను తాకట్టు పెట్టేంతటి స్థితిలో ఉన్నారు. ఒక నదిని ప్రమాదకరంగా దాటి స్కూలుకు వెళ్తున్న పిల్లలను చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత రిస్క్ చేసి మరీ చదువుకోవడం అవసరమా అంటూ కొందరు కామెట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారెవరైనా ఎమోషనల్ కాకుండా ఉండలేరు. ఈ సంఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా(Palghar district)కి చెందిన నకడ్ పాడ అనే గ్రామం(Nakad Pada Village)లో చోటు చేసుకుంది.
Maharashtra | ఇంత రిస్క్ ఎందుకు?
ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గర్గావ్(Gargaon) అనే ఊరిలో ఆశ్రమ్ పాఠశాల ఉంది. నకడ్ పాడకు చెందిన విద్యార్థులు ఈ స్కూలులో చదువుతున్నారు. అయితే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే నది దాటి వెళితే కేవలం రెండు కిలోమీటర్ల దూరమే. వేసవి, శీతాకాలాల్లో నది దాటడం కొంతమేర సులభంగా ఉంటుంది. కానీ వర్షాకాలం వచ్చిందంటే ఈ మార్గం ఒక ప్రమాదపు మార్గంగా మారుతుంది. నదిలో నీటి ప్రవాహం పెరిగినా, వర్షం ఎంత కురిసినా, ఈ పిల్లలు దైనందినంగా చదువు కోసం అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ విద్యార్థుల (Students) నది దాటే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో విద్యార్థులు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని, ఎంతో జాగ్రత్తగా, భయంగా నదిని దాటి వెళ్తున్నారు.
వీరిలో ఒక్కరి అడుగైనా తడబడి పోతే, అందరి ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి. అయినా చదువు కోసం వారు వేసే ప్రయత్నం అందరిని ఆలోచింపజేస్తోంది. ఈ పరిస్థితిని చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. చిన్నారులు చదువు కోసం ఇంతటి కష్టాలు పడాల్సి రావడం దురదృష్టకరం. ప్రభుత్వం (Government) వెంటనే స్పందించి సరైన మార్గాలు ఏర్పాటు చేయాలి అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించి సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వాపోతున్నారు.