అక్షరటుడే, వెబ్డెస్క్: PCC chief | తెలంగాణ నీటి హక్కులను ఏపీకి ధారదత్తం చేసిందే బీఆర్ఎస్ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో (Gandhi Bhavan) విలేకరులతో మాట్లాడిన మహేశ్కుమార్గౌడ్.. మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ నీటి వాటాను కాలరాసిందే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు అని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ నీటి (Telangana water) వాటాను ఏపీకి దారాదత్తం చేశారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం, రైతాంగం ప్రయోజనాల కోసం వెనక్కు తగ్గకుండా పోరాటం చేస్తుందన్నారు. ఒక్క నీటి బొట్టు కూడా వదలబోమని సీఎం రేవంత్రెడ్డి అనుకున్నారని.. కాబట్టే బనకచర్ల పనులు ఆగిపోయాయని తెలిపారు.
PCC chief | పదేళ్లలో బీసీలు కనిపించలేదా..?
బీసీ నినాదం తలకెత్తుకున్న ఎమ్మెల్సీ కవితకు (MLC Kavita) బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా? అని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. ఆస్తి పంపకాల వాటా కోసమే కవిత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) గురించి మాట్లాడుతోందని విమర్శించారు. పదేళ్లు బీసీలకు కేసీఆర్ చేసింది ఏమిటి? బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. బీసీలకు న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కుల గనణ చేయడంతో పాటు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. తెలంగాణ అసెంబ్లీలో (Telangana assembly) బీసీ బిల్లు చేసేటప్పుడు కవిత జైల్లో ఊచలు లెక్కపెడుతోందన్నారు. మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Kharge) కవిత లేఖ రాసింది బీఆర్ఎస్ నాయకురాలిగానా.. జాగృతి నాయకురాలిగానా? అని ప్రశ్నించారు. రాజకీయ శూన్యంలో ఉన్న కవిత.. తన ఉనికి కోసమే మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ నూతన రాష్ట్ర సారథిగా రాంచందర్రావు ఎన్నికపై స్పందించిన మహేష్ కుమార్గౌడ్.. బీసీల పాట పాడే బీజేపీకి బీసీ నాయకుడు దొరకలేదేమో అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చామన్నారు.
PCC chief | పార్టీ గీత దాటొద్దు..
కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) ఇటీవల చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు. అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. క్రమశిక్షణ విషయంలో ఎవరైనా సరే గీత దాటొద్దని స్పష్టం చేశారు. గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికర్జున ఖర్గే గురువారం తెలంగాణకు రానున్నారని, శుక్రవారం పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే బహిరంగ సభకు సామాజిక న్యాయ సమరభేరిగా నామకరణం చేశామని చెప్పారు.