అక్షరటుడే, వెబ్డెస్క్ : pashamylaram | సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం (pashamylaram)లోని సిగాచి ఫ్యాక్టరీలో ఇటీవల పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. మరో 33 మంది గాయపడినట్లు సిగాచి పరిశ్రమ (Sigachi Factory) యాజమాన్యం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. క్షతగాత్రులకు వైద్య సాయంతో పాటు మృతులకు కంపెనీ నుంచి బీమా క్లెయిమ్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
పాశమైలారం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తాజాగా ఈ ప్రమాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.
pashamylaram | సమగ్ర దర్యాప్తు కోసం..
సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఏమిరేట్ సైంటిస్ట్ బి వెంకటేశ్వర్ ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. సీఎస్ఐఆర్ చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్ కుమార్, రిటైర్డ్ సైంటిస్ట్ సూర్యనారాయణ, పూణే సీఐఎస్ఆర్ సేఫ్టీ ఆఫీసర్ సంతోష్ సభ్యులుగా కమిటీ వేసింది. ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.