అక్షరటుడే, వెబ్డెస్క్: America | అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 10 వేల మందికి పైగా భారతీయులు పట్టుబడ్డారు. గత జనవరి నుంచి మే నెల వరకు అగ్రరాజ్యంలోకి అక్రమంగా వలస వెళ్లే 10,382 మంది దొరికి పోయారు. ఇందులో ఎవరి తోడు లేకుండా వచ్చిన 30 మంది మైనర్లు కూడా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక, అక్రమంగా ప్రవేశిస్తూ దొరికి పోయిన వారిలో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి(Gujarat State) చెందిన వారే ఉండడం గమనార్హం. ఈ వివరాలను అమెరికా కస్టమ్స్(US Customs), బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసింది.
America | గతేడాది కంటే 70 శాతం తగ్గుదల
అక్రమ మార్గంలో అమెరికాలోకి ప్రవేశిస్తూ గత ఐదు నెలల్లో 10 వేల మందికి పైగా భారతీయులు(Indians) పట్టుబడినప్పటికీ, గతేడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. గతేడాదితో పోల్చితే 70% తగ్గుదల నమోదైంది. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్షుడిగా తిరిగి వచ్చిన తర్వాత వలస విధానాలను కఠినతరం చేయడంతో పాటు వీసా జారీ ప్రక్రియపై ఆంక్షలు విధించారు. దీంతో అక్రమ వలసలకు చెక్ పడింది. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2024 జనవరి నుంచి మే వరకు అక్రమంగా వలస వెళ్తూ 34,535 మంది భారతీయులు పట్టుబడ్డారు. ఇప్పుడదే 2025 జనవరి నుంచి మే మాసంలో పట్టుబడిన వారి సంఖ్య 10,382కి పడిపోవడం గమనార్హం. ట్రంప్ వలస విధానాలపై కఠిన చర్యల కారణంగానే అక్రమ వలసలు ఆగాయని చెబుతున్నారు. అయితే, ప్రమాదక మార్గంలో 10,382 మంది భారతీయులు ప్రాణాలను పణంగా పెట్టి అక్రమంగా ప్రవేశించారనే వార్త ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అమెరికా కలల మోజులో మైనర్లు(Miners) కూడా ఉండడం విస్మయానికి గురి చేస్తోంది. పెద్దల రక్షణ లేకుండా 30 మంది మైనర్లు అక్రమ మార్గంలో అగ్రరాజ్యానికి వెళ్లడం అమెరికాపై భారతీయులకు ఉన్న మోజుకు అద్దం పడుతోంది.
America | నిలిచిన సిండికేట్ ఆపరేషన్లు..
తాను గెలిస్తే వలస విధానాలను కఠినతరం చేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వలసలపై కొరఢా ఝళిపించారు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు (డిపోర్టేషన్) పంపించారు. అయితే, ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ముందే ఊహించిన అనేక సిండికేట్లు 2024 చివరి నుంచి తమ అక్రమ వలస ఆపరేషన్లను నిలిపివేశాయి. దీంతో యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(US Customs Border Protection) డేటా ప్రకారం.. సరిహద్దుల్లో పట్టుబడుతున్న వారి సంఖ్య బాగా పడిపోయింది. గతంలో రోజువారీగా అరెస్టయిన భారతీయుల సంఖ్య 230 ఉంటే, ఇప్పుడది 69కి తగ్గిపోయింది. ఈ సిండికేట్లలో చాలా మంది ట్రంప్ తిరిగి వస్తారని ఊహించి 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేశారు. “ట్రంప్ మళ్లీ గెలుస్తాడని స్పష్టం కావడంతో అక్రమ మార్గాల్లో వలసలు నిలిచిపోయాయని” అని గుజరాత్ కేంద్రంగా ఉన్న అక్రమ రవాణా ముఠాకు సంబంధించిన వ్యక్తి ఒకరు తెలిపారు. “ప్రజలు ఇప్పటికీ అమెరికా వెళ్లాలనుకుంటున్నారు, కానీ స్మగ్లర్లు స్పందించడం లేదు. అదే సమయంలో రవాణా ఖర్చులను పెంచారు. దీనికితోడు కఠినమైన బహిష్కరణ భయం ఉండనే ఉంది. అందుకే చాలా మంది సిండికేట్లు తమ వ్యాపారాన్ని తగ్గించేశారని” పేర్కొన్నారు.