అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైనా అందరం కలిసి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధిష్టానం ఇంకా అధ్యక్షుడిని అధికారికంగా ఖరారు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని, రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు. అయితే, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని చెప్పారు. సోమవారం హైదరాబాద్(Hyderabad)లో బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడో(Chandrababu Naidu) ఇంకో నాయకుడో చెబితే అధ్యక్షుడిని చేసే పార్టీ బీజేపీ కాదని స్పష్టం చేశారు.
Bandi Sanjay | రాష్ట్రంలో బీసీ సీఎం
తమ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి పేరును ఇంకా ప్రకటించలేదని సంజయ్(Bandi Sanjay) తెలిపారు. ఒకరికి పదవి ఇచ్చి, మిగతా వారికి ఇవ్వకపోవడం అంటే వారు డమ్మీ అయినట్లు కాదన్నారు. అధిష్టానం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎవరితోని ఏ పని జరుగుతుందో గుర్తించి వారికి ఆయా బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. దేశంలో, అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ(BJP Party) అని అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసే కార్యకర్తలెందరో ఉన్నారన్నారు. బీసీకి పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని. ముందు కేసీఆర్ను బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వమని ఈ నేతలు అడుగుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ(Telangana)లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, బీసీ నాయకుడిని సీఎం చేస్తుందని చెప్పారు.
Bandi Sanjay | ఇదేం ప్రచారం..
రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. బీజేపీలో ఇది కొత్తగా స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ఉల్టా వ్యతిరేక ప్రచారం చేసుడు ప్రారంభమైందని పేర్కొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ వ్యవహరించినా వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. ఏ నాయకుడైన సరే పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడితే అధిష్టానం సీరియస్గా పరిగణిస్తుందన్నారు. బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉంటుందనడం మూర్ఖత్వమని, బండి సంజయ్ సహా ఎవరూ లేకపోయినా పార్టీ ముందుకు నడుస్తుందన్నారు. నరేంద్ర మోదీ(Narendra Modi) నాయకత్వంలో జేపీ నడ్డా (JP Nadda)నేతృత్వంలో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.