అక్షరటుడే, వెబ్డెస్క్ :Chardham Yatra | ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాల (Heavy Rains) నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది.
వాతావరణ పరిస్థితులు కొద్దిగా మెరుగుపడటంతో, యాత్రపై విధించిన 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు గర్హ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే (Vinay Shankar Pandey) సోమవారం ప్రకటించారు. అయితే, వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, జిల్లాల కలెక్టర్లు అవసరమైతే వాహనాల రాకపోకలను నియంత్రించవచ్చని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రం భారీ వర్షాలకు విలవిలలాడుతోంది.
Chardham Yatra | మళ్లీ మొదలు..
ముఖ్యంగా ఉత్తరకాశీ జిల్లాలోని యమునోత్రి జాతీయ రహదారి వద్ద సిలాయ్ బైండ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలిపోవడంతో అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, కేదార్నాథ్ యాత్ర(Kedarnath Yatra)కు కీలకమైన రుద్రప్రయాగ్లోని సోన్ప్రయాగ్-ముంకటియా మార్గం కూడా కొండచరియలు విరిగిన కారణంగా తాత్కాలికంగా మూసివేశారు. సోన్ప్రయాగ్(Sonprayag), గౌరికుండ్(Gaurikund) ప్రాంతాల్లో భద్రత చర్యల్లో భాగంగా యాత్రికుల రాకపోకలు నిలిపివేయాల్సి వచ్చింది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన బార్కోట్-యమునోత్రి రహదారిలోని ఒక భాగానికి మరమ్మతులు పూర్తి చేసి, ఇప్పుడు రాకపోకలను పునరుద్ధరించినట్లు ఉత్తరాకాశి జిల్లా మేజిస్ట్రేట్ ప్రశాంత్ ఆర్య (Uttarkashi Magistrate Prashant Arya) చెప్పుకొచ్చారు.
“మేఘ విస్ఫోటనం వల్ల దెబ్బతిన్న రహదారిని పునరుద్దరించాం. మిగిలిన దెబ్బతిన్న భాగాలను కూడా బాగుచేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు. ఇక చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్ సహా అనేక జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా ఉండగా, నదులు ప్రమాదకర స్థాయిలో పొంగిపొర్లుతున్నాయి. నదుల ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర పరిపాలన విభాగం హెచ్చరికలు జారీ చేసింది.