అక్షరటుడే, వెబ్డెస్క్: Bjp state president election | బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నేడు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది. అధ్యక్ష రేసులో ఎన్.రాంచందర్ రావు, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ తదితర పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఎన్.రాంచందర్ రావుకు పదవి కట్టబెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bjp state president election | యోగి ఆదిత్యనాథ్లా పనిచేస్తా..
తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే యోగి ఆదిత్యనాథ్ లాగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. నన్ను అధ్యక్షుడిగా చూడాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నన్ను అధ్యక్షుడిని చేస్తే గోరక్షణ విభాగం ఏర్పాటు చేసి, గోరక్షకులకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బీజేపీ హిందుత్వ పార్టీ అని.. యోగి ఆదిత్యనాథ్ లాగా పనిచేస్తామని గడపగడపకు తిరిగి ప్రచారం చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.
Bjp state president election | రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.రాంచందర్రావు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్.రాంచందర్రావును వరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయనను నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. కాగా.. నేడు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కీలక నేతలకు అధిష్టానం నుంచి ఉదయం సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నంలోపు అధ్యక్ష అభ్యర్థికి అధికారికంగా సమాచారం ఇస్తామని హైకమాండ్ చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు అందుబాటులో ఉండాలని ఫోన్లు సైతం వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.