అక్షరటుడే, వెబ్డెస్క్ : Konda Murali | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ దంపతులకు, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. అది కాస్తా కొండా మురళి వ్యాఖ్యలతో తీవ్రం అయింది. ఈ క్రమంలో ఆదివారం హన్మకొండలో కొండా మురళి వ్యతిరేక వర్గం నేతలు భేటీ అయ్యారు. ఆయన తీరుపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Konda Murali | సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు
కొండా మురళి ఇటీవల స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మురళి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కమిటీకి ఆరు పేజీల లేఖ ఇచ్చారు. కొండా మురళి లేఖపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమావేశమై కొండా దంపతుల తీరుపై వారు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ హాజరు కావడం గమనార్హం.
Konda Murali | మంత్రిపైనే కామెంట్స్
గతంలో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై వ్యాఖ్యలు చేసి క్రమశిక్షణ కమిటీ ఎదుట కొండా మురళి హాజరయ్యారు. అనంతరం ఆయన ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపైనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమకు వ్యతిరేకంగా పొంగులేటి కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ వ్యతిరేక వర్గాన్ని ఆయన ఏకం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ మారిన వారు పదవులకు రాజీనామా చేయాలని కడియం శ్రీహరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే రేవూరి ప్రకాశ్రెడ్డి తామే గెలిపించామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.