అక్షరటుడే, వెబ్డెస్క్: Turmeric Board inauguration | తెలంగాణ పసుపు రైతుల 40 ఏళ్ల కలను మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) అన్నారు. నిజామాబాద్ నగరంలో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అర్వింద్ (MP Arvind)తో పాటు రాష్ట్ర నేతలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు (Turmeric Board) మంజూరు చేయడమే కాదు.. నిజామాబాద్కు చెందిన బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికే ఛైర్మన్ పదవి అప్పగించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Turmeric Board inauguration | ప్రపంచానికి నిజామాబాద్ పసుపు ఎగుమతి
నిజామాబాద్ (Nizamabad) పసుపు రాజధానిలా మారాలని అమిత్ షా ఆకాంక్షించారు. మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఒక బిలియన్ డాలర్ పసుపు ఎగుమతులే (Turmeric Exports) లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. ప్రపంచంలో పసుపునకు డిమాండ్ ఉన్న దృష్ట్యా అందులో ఉండే ఔషధ గుణాలపై ప్రచారం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎగుమతులకు కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు.
పసుపు ప్రొడక్షన్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్స్ తదితర అంశాలపై పసుపు బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచం అంతా నిజామాబాద్ పసుపు గుబాళిస్తుందన్నారు. భారత్ ఆర్గానిక్ కార్పొరేషన్, ఎక్స్పోర్ట్ కార్పొరేషన్లను కూడా ఇందూరులో ఏర్పాటు చేసి కొనుగోలు, రవాణా, ఎగుమతి పసుపు బోర్డు చూసుకుంటుందని షా వివరించారు.
Turmeric Board inauguration | పసుపు రైతుల పోరాటాలతో..
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) మాట్లాడుతూ పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గుర్తించి బోర్డును మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అందులోనూ ఇందూరుకు బోర్డు రావడం గర్వకారణమన్నారు. ఇందుకోసం ఎంపీ అర్వింద్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రధాని మోదీతో పాటు అమిత్షాను పలుమార్లు కలిసి బోర్డు తీసుకురావడానికి కృషి చేసిన అర్వింద్ను అభినందించారు. తెలంగాణ రైతులను రాజులను చేయడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Turmeric Board inauguration | బాధ్యతగా విధులు నిర్వర్తిస్తా: పల్లె గంగారెడ్డి
ప్రధాని మోదీ, అమిత్షా సహకారంతో ఎంపీ అర్వింద్ పసుపుబోర్డు సాధించారని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి (Palle Ganga Reddy) పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు ఏళ్లుగా ఎదురుచూశారన్నారు. జాతీయ కార్యాలయం సైతం నిజామాబాద్లో ఏర్పాటు చేయడం అభినందనీయన్నారు. 30ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా పనిచేశానని.. నాలాంటి సామాన్య కార్యకర్తకు పసుపుబోర్డు జాతీయ అధ్యక్షుడి హోదా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. రైతుల సంక్షేమం కోసం ఉన్నతి కోసం మోదీ కృషి చేస్తున్నారన్నారు. పీఎం మోదీ ఆధ్వర్యంలో పసుపు ఎగుమతులను 2030 వరకు మరింత పెంచేందుకు బోర్డు తరపున కృషి చేస్తామని హామీ ఇచ్చారు