అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా (Hydraa) చర్యలు చేపడుతోంది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగిస్తోంది. ఇటీవల జీడిమెట్లలో పార్క్ ఆక్రమణలను ఫిర్యాదు చేసిన మూడు గంటల్లోనే తొలగించినా హైడ్రా తాజాగా మరో పార్క్లో అక్రమ నిర్మాణాలను కూల్చి వేసింది.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఎల్లారెడ్డిగూడలో దశాబ్దాల నాటి పార్క్ ఆక్రమణకు గురైంది. దీంతో సాయిసారధినగర్ నివాసితులు పార్క్ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా వారు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో పార్క్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను హైడ్రా తొలగించింది. సుమారు 1,533 చదరపు గజాల పబ్లిక్ పార్క్ను పునరుద్ధరించింది.
Hydraa | మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్లు సిద్ధం
హైడ్రా ఆక్రమణల తొలగింపుతో పాటు వరద ముంపు (Floods) నియంత్రణకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నాలాలపై నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు పూడిక తీత పనులను హైడ్రా ఆధ్వర్యంలో చేపడుతున్నారు. తాజాగా వర్షాకాలం వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్(MET)లను హైడ్రా ఏర్పాటు చేసింది. మొత్తం 30 సర్కిళ్లలో 150 టీమ్లు జులై 1నుంచి పని చేయనున్నాయి. విధి నిర్వహణలో ఎక్కడా ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ బృందాలకు సూచించారు.
Hydraa | వరద సాఫీగా సాగేలా..
వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా ఈ బృందాలు చూడనున్నాయి. వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు చేపట్టనున్నాయి. ఎక్కడ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచనాకు వచ్చి.. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. చెట్లు పడిపోతే వెంటనే వాటిని తొలగించాలి. ఈ బృందాలకు హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహకరిస్తాయని అధికారులు తెలిపారు.