అక్షరటుడే, వెబ్డెస్క్: Pakistan | పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మృతి చెందారు. శనివారం ఖైబర్ ఫఖ్తుంక్వాలో సైనిక కాన్వాయ్(Military convoy)పై జరిగిన ఈ దాడిలో మంది సైనికులు మృతి చెందగా, చాలా మంది గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉత్తర వజీరిస్తాన్(North Waziristan)లోని ఖడ్డి ప్రాంతంలో సైనిక కాన్వాయ్ లక్ష్యంగా ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అజ్ఞాత వ్యక్తి పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో బాంబు నిర్వీర్య విభాగానికి చెందిన మైన్-రెసిస్టెంట్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ దాడికి ఇత్తెహాద్-ఉల్-ముజాహిదీన్ పాకిస్తాన్తో అనుబంధంగా ఉన్న అస్వాద్-ఉల్-హర్బ్ గ్రూప్ బాధ్యత వహించింది.
Pakistan | ఆత్మాహుతి దాడి..
బలూచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army) ఇప్పటికే పాకిస్తాన్కు కంట్లో నలుగుగా మారింది. ఇప్పుడు ఖైబర్ ప్రాంతంలో అస్వాద్-ఉల్-హర్బ్ గ్రూప్ తన ప్రాబల్యం చాటుతుండడం పాక్కు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర వజీరిస్తాన్ జిల్లాలో సైనిక కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మరణించగా, మరో 29 మంది గాయపడ్డారని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. “ఒక ఆత్మాహుతి బాంబు పేలుడు పదార్థాలతో నిండిన వాహనం సైనిక కాన్వాయ్పైకి దూసుకెళ్లింది. ఈ పేలుడులో 16 మంది సైనికులు మరణించారు, 10 మంది సైనిక సిబ్బంది ,19 మంది పౌరులు గాయపడ్డారు” అని సదరు అధికారి వెల్లడించారు. బాంబు పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లు కూడా దారుణంగా దెబ్బ తిన్నాయి. “ఈ పేలుడు కారణంగా రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోయాయి, ఆరుగురు పిల్లలు గాయపడ్డారు” అని మరో పోలీసు అధికారి చెప్పారు.
Pakistan | వరుస దాడులతో కలకలం..
పాకిస్తాన్ అంతటా, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా(Khyber Pakhtunkhwa), బలూచిస్తాన్ ప్రాంతాలలో ఉగ్రవాద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. బలూచ్, ఖైబర్ ప్రాంతంలో తరచూ చోటు చేసుకుంటున్న దాడులకు పాకిస్తాన్(Pakistan)కు ఇబ్బందిగా పరిణమించాయి. ప్రత్యేక దేశం కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ తరచూ దాడులు పాల్పడుతోంది. ఇక, ఖైబర్ తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) దాడులకు పాల్పడుతోంది. గత మార్చిలో దక్షిణ వజీరిస్తాన్లోని జండోలా చెక్పోస్ట్ సమీపంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ శిబిరాన్ని ఆత్మాహుతి దాడి లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో TTPతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న 10 మంది ఉగ్రవాదులను చంపినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించిందని జియో న్యూస్ నివేదించింది.