అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా అధికారులు(Hydraa Officers) పలు ఆక్రమణలను గుర్తించి తొలగిస్తున్నారు. అంతేగాకుండా ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనికోసం ప్రజావాణి కార్యక్రమం(Prajawani Program) నిర్వహిస్తున్నారు.
హైడ్రా ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ రంగనాథ్(Commissioner Ranganath) వేగంగా స్పందిస్తున్నారు. ఆయా ఫిర్యాదులపై విచారణ చేపట్టి ఆక్రమణలు నిజమని తేలితే కూల్చి వేస్తున్నారు. తాజాగా ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు.
కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్ల గ్రామం సర్వే నెంబర్ 218, 214లో ఉన్న రుక్మిణి ఎస్టేట్స్కు చెందిన పార్కు(Rukmini Estates Park)ను హైడ్రా కాపాడింది. 1200 గజాల పార్కు ఉంటే తప్పుడు పత్రాలతో సగానికి పైగా కబ్జా చేశారు. ఈ కబ్జాలు తొలగించాలని కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం ఎదుట రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం హైడ్రా కార్యాలయానికి వచ్చి కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు.
Hydraa | వెంటనే చర్యలు
హైడ్రా కమిషనర్ ఫిర్యాదు అందగానే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్(Apoorva Chauhan) గారికి ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు అందగా సాయంత్రానికే మున్సిపల్ సిబ్బందితో కలసి హైడ్రా రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. అనంతరం పార్క్ చుట్టూ ప్రహరీ నిర్మించింది. మూడు గంటల్లోనే సమస్యను పరిష్కరించడం గమనార్హం. కాగా శనివారం తెల్లవారుజామున వాకింగ్ చేయడానికి వచ్చిన స్థానికులు కబ్జాలు తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.