అక్షరటుడే, వెబ్డెస్క్: Andhra Pradesh : ఆధునిక సమాజంలో బంధాలు, అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. డబ్బులు, ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వారినే కడతేర్చుతున్నారు.
ముఖ్యంగా తోబుట్టువులు, తల్లిదండ్రులనే పట్టించుకోకపోవడం అటుంచి, వారినే కిరాతకంగా వధిస్తున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. చెల్లికి ఆస్తి రాసిచ్చారని తల్లిదండ్రులను ఓ దుర్మార్గుడు ట్రాక్టర్తో అతికిరాతకంగా ఢీకొట్టి కడతేర్చాడు. బుడి బుడి అడుగులు వేయించిన తల్లినే హత మార్చాడు. భుజాన ఎత్తుకుని లోకం చూపించిన తండ్రిని ఈ లోకం నుంచే భయానకంగా పరలోకానికి సాగనంపాడు.
విజయనగరం Vizianagaram జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు(55), జయ (45) దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిని ఇరువురికి ఇచ్చారు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడం పుత్రరత్నం రాజశేఖర్కి నచ్చలేదు. దీంతో తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. ఇదే విషయమై వారి మధ్య తరచూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే కుమార్తెకు ఇచ్చిన భూమిని శనివారం(ఏప్రిల్ 26) రాజశేఖర్ ట్రాక్టర్తో చదును చేస్తున్నాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కుమారుడిని వారించారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. ట్రాక్టర్తో వారిని ఢీకొట్టి చంపేశాడు.