అక్షరటుడే, వెబ్డెస్క్: Secunderabad Elevated Corridor | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లేవారు సికింద్రాబాద్లో ట్రాఫిక్ జామ్(Secunderabad Traffic jam)తో అనేక తిప్పలు పడతారు. సికింద్రాబాద్లోని ప్యారడైజ్ సర్కిల్(Paradise Circle) వద్ద ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది.
ఈ తిప్పలను తప్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎలివేటేడ్ కారిడార్లను నిర్మించాలని సంకల్పించింది.
Secunderabad Elevated Corridor | రక్షణశాఖతో ఒప్పందం
సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ నుంచి బోయిన్పల్లి(Boinpally) వరకు కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది కంటోన్మెంట్ ల్యాండ్ కావడంతో చాలా రోజులుగా రక్షణ శాఖ నుంచి అనుమతులు రాలేదు. బీఆర్ఎస్ హయాంలోనే ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా.. అనుమతులు రాకపోవడంతో ప్రక్రియ ఆగిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ ఓకే చెప్పింది. ఈ కారిడార్ కోసం డిఫెన్స్ ల్యాండ్ కేటాయించింది. ఈ మేరకు ఆదివారం డిఫెన్స్ శాఖ, రాష్ట్రప్రభుత్వం మధ్య ఒప్పందం కుదరనుంది.
Secunderabad Elevated Corridor | ఆదా కానున్న సమయం
కారిడార్ నిర్మాణంలో నగరం నుంచి ఉత్తర తెలంగాణ(Telangana) జిల్లాలకు రవాణా వ్యవస్థ మరింత సులభతరం కానుంది. సికింద్రాబాద్ ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఔటర్రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్(Elevated corridor) నిర్మిస్తే.. వాహనదారుల సమయం ఎంతో ఆదా కానుంది. ఎక్కడా ట్రాఫిక్లో ఆగాల్సిన అవసరం లేకుండా.. నగరంలోకి ప్రవేశించవచ్చు. ఆదివారం ఒప్పందం పూర్తయితే హెచ్ఎండీఏ టెండర్లు(HMDA Tenders) పిలిచే అవకాశం ఉంది.
కాగా.. ఎలివేటేడ్ కారిడార్ కోసం కంటోన్మెంట్ పరిధిలోని భూములను రక్షణ శాఖ హెచ్ఎండీఏకు బదిలీ చేయనుంది. దీనికి బదులుగా రక్షణశాఖకు ఇతర ప్రాంతాల్లో భూమి కేటాయించాల్సి ఉంటుంది. ఆ భూముల వివరాలు.. బదలాయింపులపై రేపు అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే నగరవాసులకు ఎంతో మేలు జరగనుంది.