అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) యువతకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల నివారణపై సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్ (CSI Church Ground) నుంచి కళాభారతి ఆడిటోరియం (Kalabharti Auditorium) వరకు సుమారు 2 వేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కళాభారతి ఆడిటోరియం వద్ద కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు.
Kamareddy Collector | చదువుపై దృష్టి పెట్టాలి..
ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. స్నేహితుల ప్రోద్బలంతోనో.. తెలిసీతెలియని స్థితిలో మత్తుపదార్థాలకు బానిసలు కావద్దన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఇంట్లో ఒకరు డ్రగ్స్కు బానిసైతే ఇళ్లంతా నాశనమవుతుందని.. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు.
Kamareddy Collector | ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
తెలంగాణ ప్రభుత్వం సైతం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్, ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎక్సైజ్ సూపరిండెంట్ హన్మంత్ రావు, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య, వివిధ శాఖల ఉద్యోగులు