అక్షరటుడే, వెబ్డెస్క్: Justice Gavai | కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో.. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్(Justice BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని, పార్లమెంట్ కాదని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్కు అధికారాలున్నాయని, కానీ అది రాజ్యాంగం ప్రాథమిక రూపాన్ని మాత్రం మార్చలేదన్నారు. కీలక మూడు విభాగాలు కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కలిసి పని చేయాలని, అది కూడా రాజ్యాంగం పరిధిలోనే పని చేయాలని వ్యాఖ్యానించారు. తన స్వస్థలమైన అమరావతి(Amaravati)లో జరిగిన ఓ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ గవాయ్ మాట్లాడారు. పార్లమెంట్ సవరణల ద్వారా రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను మార్చలేదని, 1973లో కేశవానంద భారతీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును ప్రస్తావించారు.
Justice Gavai | రాజ్యాంగానికి లోబడే..
బిల్లులు ఆమోదించడంలో రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు(Supreme Court) గడువు విధించిన నేపథ్యంలో.. న్యాయవ్యవస్థపై ఇటీవల వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో సీజేఐ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో ఏది అత్యున్నతమైనదనే చర్చ ప్రతిసారీ జరుగుతుందని సీజేఐ గుర్తు చేశారు. కానీ, ఆయా వ్యవస్థల కంటే రాజ్యాంగమే అత్యున్నతమైనదని, అవి రాజ్యాంగ పరిమితులకు లోబడే పని చేయాల్సి ఉంటుందన్నారు. “ప్రజాస్వామ్యంలో ఏ విభాగమైనా – కార్యనిర్వాహక, శాసనసభ లేదా న్యాయవ్యవస్థ – అత్యున్నతమైనదని ఎల్లప్పుడూ చర్చ జరుగుతుంది. పార్లమెంటు(Parliament) అత్యున్నతమైనదని చాలామంది అంటారు నమ్ముతారు, కానీ నాకు రాజ్యాంగమే అత్యున్నతమైదని” చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు.
Justice Gavai | న్యాయమూర్తులు స్వతంత్రులు కారు..
న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించలేరని, రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేయాలని గవాయ్ తెలిపారు. “ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడం ద్వారా న్యాయమూర్తి స్వతంత్రుడు కాడు. న్యాయమూర్తి ఎల్లప్పుడూ తన విధిని గుర్తుంచుకోవాలి. మనం పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, సూత్రాల సంరక్షకులం. మనకు అధికారం మాత్రమే లేదు.. మనపై ఒక విధి ఉందని” చీఫ్ జస్టిస్ గవాయ్ అన్నారు. ప్రజలు తమ తీర్పు గురించి ఏమి చెబుతారో దాని ద్వారా న్యాయమూర్తి మార్గనిర్దేశం చేయకూడదని, మనం స్వతంత్రంగా ఆలోచించాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు చెప్పేది (న్యాయవ్యవస్థ గురించి) మన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభావితం చేయదన్నారు.