అక్షరటుడే, వెబ్డెస్క్: Govt Employees | రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు(Employees), పెన్షనర్లకు(Pensioners) గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా ఉద్యోగుల వైద్య బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. వీటిని విడుదల చేయాలని ఉద్యోగులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. రూ.180.38 కోట్ల వైద్య బిల్లుల బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు.
దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం(State Government)పై కొంతకాలంగా ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహంతో ఉన్నారు. తమ జీతాలు పెంచాలని, డీఏలు విడుదల చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గ సబ్ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల డిమాండ్లలో ప్రధానంగా డీఏలు, వైద్య బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపులు ఉన్నాయి.
Govt Employees | ఉద్యోగుల హర్షం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవల డీఏ పెంచింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 2023 జనవరి 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది. మరో నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే మరో డీఏను త్వరలో పెంచనున్నట్లు తెలిపింది. విద్యుత్ ఉద్యోగులకు కూడా రెండు రోజుల క్రితం ప్రభుత్వం రెండు శాతం డీఏ పెంచింది. తాజాగా వైద్య బిల్లుల బకాయిలు విడుదల చేసింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పెండింగ్ డీఏలను కూడా విడుదల చేయాలని కోరుతున్నారు.