అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని, ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. అలాంటప్పుడు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. గురువారం ఉదయం కవిత బంజారాహిల్స్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం రెండు సంస్థలకు రూ.1,200 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారని కవిత ఆరోపించారు. కానీ ఇంతవరకు ఎత్తిపోతల పనులు ప్రారంభించలేదని విమర్శించారు. బయటకెళ్లి అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు తీసుకుంటున్నారన్నారు.
MLC Kavitha | శ్వేత పత్రం విడుదల చేయాలి
సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ జాగృతి తరఫున అవినీతి చక్రవర్తి అనే బిరుదు ఇస్తున్నట్లు కవిత అన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని త్వరలోనే బయట పెడతామన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వంలో విద్యా, వైద్య రంగాలను విస్మరించారని విమర్శించారు. విద్య, వైద్యానికి నిధులు కేటాయించకుండా.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) తెచ్చిన రూ.రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేశారో రేవంత్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
MLC Kavitha | బీజేపీ ఎంపీలు విఫలం
కేంద్రం నుంచి నిధులు తీసుకు రావడంలో రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు (BJP MP’s) విఫలం అయ్యారని కవిత విమర్శించారు. బుధవారం కేంద్ర కేబినెట్ పుణె మెట్రోకు నిధులు కేటాయిందన్నారు. తెలంగాణ మెట్రోకు రూపాయి రాకున్నా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు స్పందించడం లేదని విమర్శించారు.
గత జూలై 6న రేవంత్రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) భేటీ అయ్యారని కవిత పేర్కొన్నారు. అనంతరం ఆయన బాబుకు హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి జలాలను గిఫ్ట్గా ఇచ్చారని ఆరోపించారు. ఆ తర్వాతే జులై 15 నాడు సెంట్రల్ ఏజెన్సీతో బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) ప్రారంభమైందన్నారు.